ముంబై: డే-నైట్ టెస్టు భారత క్రికెట్లో మంచి శుభపరిణామం. ప్రస్తుతం మార్పులు అవసరం. డే-నైట్ టెస్టులు అభిమానులను స్టేడియాలకు తీసుకొస్తాయి అని మాజీ భారత క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ తొలిసారి గులాబి బంతి టెస్టు ఆడటాన్ని ఆయన ప్రశంసించారు. నవంబర్ 22 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్లు తొలిసారి డేనైట్ టెస్టు మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.
రెండో టీ20: రెండు మార్పులతో భారత్.. తుది జట్టు ఇదే!!
అనింద్య దత్తా రాసిన 'విజార్డ్స్ ది స్టోరీ ఆఫ్ ఇండియన్ స్పిన్ బౌలింగ్' పుస్తకాన్ని మంగళవారం వెంగ్సర్కార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 'డే-నైట్ టెస్టు భారత క్రికెట్లో మంచి శుభపరిణామం. అయితే మ్యాచ్ ఎలా సాగుతుందో తెలుసుకొనేందుకు చివరి వరకు వేచిచూడాలి. బహుశా మంచు ప్రభావం ఉండొచ్చు. అదెలా ప్రభావం చూపిస్తుందో తెలియదు. గులాబి బంతి మ్యాచులతో టెస్టు క్రికెట్కు మంచి జరుగుతుంది కాబట్టి పోరు సవ్యంగా సాగుతుందనే అనుకుంటున్నా' అని అన్నారు.
'ప్రస్తుతం మార్పులు అవసరం. డే-నైట్ టెస్టులు అభిమానులను స్టేడియాలకు తీసుకొస్తాయి. మంచు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. ఏదేమైనప్పటికీ ఓ మంచి పనికోసం ముందడుగు వేయాల్సిందే. ఆస్ట్రేలియాలో గులాబి టెస్టులు ఎంత విజయవంతం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. ఆస్ట్రేలియాలో అభిమానుల లాగే భారతీయులు కూడా కచ్చితంగా వీటిని ఆదరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. జనాలను తిరిగి స్టేడియంలో కూర్చుబెట్టేందుకు ఇదో మంచి మార్గం' అని వెంగ్సర్కార్ అభిప్రాయపడ్డారు.
భారత క్రికెట్ టెస్టు చరిత్రలో డేనైట్ టెస్టు ఆడటం ఇదే తొలిసారి కాబట్టి.. టీమిండియాకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించి వారి అనుభవాలను పంచుకోనుంది. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ-బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యాలు సంయుక్తంగా భారత మాజీ కెప్టెన్లకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 2001లో ఆసీస్పై కోల్కతాలో జరిగిన మ్యాచ్లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపనున్నారు.
భారత మాజీ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ కామెంటేటర్ అవతారం ఎత్తే అవకాశం ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ధోనీ చేత కామెంటరీ చెప్పించే ఏర్పాట్లను బీసీసీఐ పరిశీలిస్తోందట. దీనికి స్టార్ స్పోర్ట్స్ అంగీకారం తెలిపితే.. ధోనీని కామెంటరీ బాక్స్లో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. కోల్కతా టెస్ట్ మొదటి రెండు రోజుల్లో భారత మాజీ టెస్టు కెప్టెన్లు మైదానంలో సందడి చేయనున్నారు. అందరు కెప్టెన్లు జాతీయ గీతం కోసం మైందానంలోకి వస్తారని తెలుస్తోంది.