ఇండోర్: స్థానిక హోల్కర్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 15 ఫోర్స్, 1 సిక్స్తో తన కెరీర్లో రెండో సెంచరీ చేసాడు. అజింక్య రహానే 88 (8 ఫోర్స్) కూడా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 153 పరుగుల ఆధిక్యంలో ఉంది.
విద్యార్థులతో బాలల దినోత్సవాన్ని జరుపుకున్న ధోనీ!
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో రహానే అర్ధ సెంచరీ చేసే క్రమంలో 4వేల పరుగుల మార్కును చేరాడు. టెస్టు ఫార్మాట్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్న 16వ భారత క్రికెటర్గా రహానే నిలిచాడు. రహానే 104 ఇన్నింగ్స్ల్లో 4 వేల పరుగుల మార్కును చేరడంతో.. భారత మాజీ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ల సరసన నిలిచాడు. గంగూలీ, లక్ష్మణ్లు కూడా తమ కెరీర్లో 104వ ఇన్నింగ్స్లోనే 4 వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నారు.
బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ(6) విఫలం కాగా.. మయాంక్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. పుజారా అండతో ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. అర్ధ సెంచరీ అనంతరం పుజారా.. ఆ వెంబడే కెప్టెన్ విరాట్ కోహ్లీ (0)ఔట్ అయినా.. మయాంక్ సెంచరీతో మెరిశాడు. ఆపై రహానే కూడా అర్థ శతకం సాధించడంతో భారత్ ఆధిక్యంలో నిలిచింది. మయాంక్-రహానేల జోడి ఇప్పటికే 184 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
రెండో రోజు టీ విరామ సమయాన్ని భారత తమ తొలి ఇన్నింగ్స్లో 84 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ (156), రహానే (82) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. రహానే సెంచరీకి చేరువలో ఉండగా.. మయాంక్ 150 పరుగుల మార్క్ దాటాడు. దక్షిణాఫ్రికాతో వైజాగ్లో జరిగిన తొలి టెస్టులో మయాంక్ తన కెరియర్లో తొలి సెంచరీ చేశాడు. ఆ సెంచరీనే డబుల్ సెంచరీ (215)గా మార్చుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్లో భారత పేస్ త్రయం ధాటికి బంగ్లాదేశ్ తొలి రోజే చాప చుట్టేసింది. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఆరంభంలోనే ప్రత్యర్థి పతనానికి బాటలు వేయగా.. ఆ తర్వాత రివర్స్ స్వింగ్తో పేసర్ మహ్మద్ షమీ బెంబేలెత్తించాడు. షమీ (3/27), ఇషాంత్ (2/20), ఉమేశ్ (2/47) నిప్పులు చెరగడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది.