ఆదిలోనే భారత్కు షాక్:
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు బంగ్లా బౌలర్ షఫియుల్ షాక్ ఇచ్చాడు. రెండు పరుగులకే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మను పెవిలియన్ పంపాడు. జట్టు స్కోర్ 35 పరుగుల వద్ద మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (19)ను ఔట్ చేశాడు. దీంతో ఓపెనర్లను కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడింది. అయితే లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లు ఆచితూచి ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
రాహుల్ హాఫ్ సెంచరీ:
క్రీజులో కుదురుకున్న అనంతరం దూకుడు పెంచిన రాహుల్, శ్రేయాస్ ఎడాపెడా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇద్దరూ కలిసి 41 బంతుల్లోనే 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే లోకేశ్ రాహుల్ పెవిలియన్ చేరాడు. అల్ అమీన్ వేసిన 13వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించే క్రమంలో లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ నిష్క్రమించాడు.
సిక్సర్లతో చెలరేగిన శ్రేయాస్:
రాహుల్ క్రీజులో ఉన్నంత వరకు ఓపికగా ఆడిన శ్రేయాస్.. అతడు ఔట్ అవ్వగానే శివమెత్తాడు. రిషబ్ పంత్ (6) అండతో రెచ్చిపోయాడు. అఫిఫ్ హొసైన్ బౌలింగ్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలి మూడు బంతులను స్టాండ్స్లోకి పంపి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే కేవలం 27 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్తో టీ20ల్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో 17వ ఓవర్లో శ్రేయాస్ ఔట్ అయ్యాడు.
|
మనీశ్ పాండే మెరుపులు:
ఇన్నింగ్స్ చివరలో మనీశ్ పాండే 13 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. మనీష్ ధాటిగా ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అల్ అమిన్ హొసైన్ ఓ వికెట్ దక్కింది.