
హైదరాబాద్: రాజ్కోట్లో వాతావరణం ప్రస్తుతం చల్లబడింది. దీంతో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంతో ఏర్పడిన వాయుగుండం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం నిర్వాహాకులు మ్యాచ్కి ఏర్పాట్లు చేస్తున్నారు.
బుధవారం సాయంత్రం కూడా రాజ్కోట్లో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నానికి తుఫాన్ బలహీన పడటంతో, సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతంగా ఉంది. రాత్రి వేళలో మాత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షం తగ్గినప్పటికీ వాతావరణం చల్లబడటంతో ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న తరుణంలో వర్షం కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. సిరీస్ గెలిచే అవకాశం లేకపోగా.. చివరి టీ20లో సిరీస్ సమం కోసం ఒత్తిడి మధ్య పోటీకి దిగాల్సి వస్తుంది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రాజ్కోట్ వేదికగా జరుగనున్న రెండో టీ20 మ్యాచ్లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.
వాతావరణం, పిచ్ను చూస్తుంటే జట్టు బౌలింగ్ విభాగంలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజ్కోట్ పిచ్పై 2017లో న్యూజిలాండ్ 196/2 స్కోరు చేసింది. 2013లో ఆస్ట్రేలియా 201/7 స్కోరు చేసింది. రెండుసార్లు ఆ జట్లు తొలిసారి బ్యాటింగ్ చేశాయి. ఇక్కడ జరిగిన ఆ రెండు మ్యాచ్ల్లో కివీస్తో ఓడిన భారత్.. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
ఈసారి కూడా పిచ్ బ్యాటింగ్కే అనుకూలంగా కనిపిస్తోంది కాబట్టి మళ్లీ పరుగుల ప్రవాహం చూసే వీలుంది. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ భారత్ తరఫున 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడనున్న తొలి క్రికెటర్గా గుర్తింపు పొందనున్నాడు.