తొలి క్రికెటర్ చహల్:
అయితే ఈ మ్యాచ్లో తొలుత యుజ్వేంద్ర చహల్ తుది జట్టు (ప్లేయింగ్ 11)లో లేడు. తొలి ఇన్నింగ్స్లో మెరుపు బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజాకు చివరి ఓవర్లో తలకు గాయమవడంతో చహల్ కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన చహల్.. ఆరోన్ ఫించ్ (35), స్టీవ్ స్మిత్ (12), మాథ్యూ వేడ్(7) లాంటి కీలక బ్యాట్స్మెన్లను ఔట్ చేశాడు. తన కోటా 4 ఓవర్లో 25 రన్స్ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన చహల్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన తొలి క్రికెటర్ చహల్ కావడం విశేషం.
కంకషన్ సబ్స్టిట్యూట్గా:
ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా హెల్మెట్కు బంతి తాకింది. ఆ తర్వాత కూడా జడేజా బ్యాటింగ్ చేశాడు. కానీ మ్యాచ్ విరామం తర్వాత జడేజా స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా చహల్ బరిలోకి దిగుతాడని మ్యాచ్ రిఫరీకి టీమిండియా సమాచారం అందించింది. దీనికి రిఫరీ అంగీకరించారు. జడేజా స్థానంలో చహల్ రావడంపై ఆస్ట్రేలియా కోచ్ లాంగర్, కెప్టెన్ అరోన్ ఫించ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్తో గొడవకి దిగారు. జడేజాకు కాంకషన్ సబ్స్టిట్యూట్ ఎలా ఇస్తారంటూ లాంగర్ చాలా ఆగ్రహంగా అడుగుతుండటం వీడియోలో కనిపించింది. కాంకషన్ సబ్స్టిట్యూట్ నిబంధనల మేరకు తాను చహల్ని అనుమతించినట్లు ఆయన స్పష్టం చేశారు.
పాఠాలు నేర్చుకున్నా:
ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభం కావడానికి 10-15 నిమిషాల ముందు నువ్వు మ్యాచ్ ఆడబోతున్నావని చెప్పారని మ్యాచ్ అనంతరం యుజ్వేంద్ర చహల్ వెల్లడించాడు. వన్డే తప్పిదాలతో పాఠాలు నేర్చుకున్నాని, ఆడం జంపా బౌలింగ్ చేసే విధానం చూసి తాను కూడా అలా ప్రయత్నించానన్నాడు. ఫించ్, స్మిత్ వికెట్లను తీయడం ఆనందాన్నిచ్చిందని, ప్రణాళికలను అమలు చేయగలిగానని చహల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చహల్ను తొలుత తీసుకోవాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు.