
హైదరాబాద్: ఓపెనర్ యశస్వి జైస్వాల్(62) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టుకు 234 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో కోరీ కెల్లీ, టాడ్ ముర్ఫే తలో రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ విల్లన్, కొన్నార్ సుల్లే, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టుకు ఆసీస్ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఈ మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది.
జట్టు స్కోరు 35 పరుగుల వద్ద ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా(14) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(2), కెప్టెన్ ప్రియమ్ గార్గ్(5), ధ్రువ్ చంద్(15) తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరారు. రవి బిష్ణోయ్(30), అధర్వ అంకోలేకర్(55) పరుగులతో రాణించి ఏడో వికెట్కు 60కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఫలితంగా టీమిండియా 233 పరుగులు చేయగలిగింది. ఆసీస్ యువ బౌలర్లు తమ పదునైన బౌన్సర్లతో భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టారు. కాగా, నాకౌట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత యువ జట్టు మెరుగైన రికార్డు కలిగి ఉండటం భారత్కు ఊరటనిచ్చే అంశం. ఈ టోర్నీలో రవి బిష్టోయ్ 3 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి ఫామ్లో ఉన్నాడు.
2013 నుంచి అండర్-19 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాతో భారత్ ఐదు సార్లు తలపడగా నాలుగు సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.