వీడియో కాల్లో మాత్రమే:
కూతురు రూపంలో తనకు అదృష్టం కలిసి వచ్చిందని టీ నటరాజన్ మురిసిపోతున్నాడు. తనకు పాప పుట్టం అదృష్టమనీ, నెట్ బౌలర్గా మాత్రమే ఎంపికైన తాను ఇప్పడు ప్రధాన జట్టుకు ఎంపికయ్యానని.. ఇంతకంటే శుభవార్త ఏమి ఉంటుందని నటరాజన్ తెలిపాడు. అయితే తన కూతురు ఫోటో కూడా ఇంకా చూడలేదని, వీడియో కాల్లో మాత్రమే చూశానని నటరాజన్ చెప్పాడు. అలాగే తన భార్య పవిత్ర ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారన్నాడు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు.
గడ్డం కత్తిరించుకుంటా:
బిడ్డ పుట్టిన సందర్భంగా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు గడ్డం కత్తిరించుకుంటానని టీ నటరాజన్ వెల్లడించాడు. అయితే దీనికి ముందు ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉందన్నాడు. ఇక తన కూతురిని చూసేందుకు మాత్రం నటరాజన్ ఆసీస్ సిరీస్ పర్యటన అయ్యేంతవరకు ఆగాల్సిందే. నటరాజన్ మొత్తం పర్యటన ముగిసే వరకు ఉంటే.. అతను జనవరి మూడవ వారంలో మాత్రమే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీసీసీఐ అనుమతి ఇస్తే టీ20 సిరీస్ అనంతరం భారత్ రావొచ్చు. నవంబరు 7న నటరాజన్ భార్య పవిత్ర పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయ సంబరాల్లో ఉండగానే.. డేవిడ్ వార్నర్ ఈ శుభవార్తను అందరికీ షేర్ చేశాడు.
యార్కర్ల నట్టూ:
ఈ సీజన్లో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 8.02 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. మరే ఇతర బౌలర్ సాధ్యం కానీ విధంగా ఈ సీజన్లో నటరాజన్ సుమారు 65 యార్కర్లు వేసాడు. దాంతోనే తన పేరును యార్కర్ల నట్టూగా మార్చుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్ 2లో కూడా చివరి ఓవర్లలో అద్భుతంగా యార్కర్లు వేసి భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. నట్టూ బౌలింగ్కు యువరాజ్ సింగ్, హర్షాబోగ్లే సైతం ఫిదా అయ్యారు.
నట్టూ ప్రయాణం ఇలా:
2016-17 టీఎన్పీఎల్ సీజన్లో 7 మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన నటరాజన్పై తమిళనాడు క్రికెట్ సంఘం దృష్టిపెట్టింది. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతడిని రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ 6 మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో ఆ తర్వాతి సీజన్లో అతడిని వదిలేసింది. టీఎన్పీఎల్లో అతడి ప్రతిభను గమనించిన శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 2018 వేలంలో హైదరాబాద్ తరఫున కొనుగోలు చేసేలా కృషి చేశాడు. అయితే గత రెండేళ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే అవకాశం టీ నటరాజన్కు రాలేదు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 11 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి అదరగొట్టాడు. తమిళనాడుకు డెత్ బౌలర్గా ఆవిర్భవించాడు. దీంతో ఈ సీజన్లో హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అద్భుతంగా రాణించాడు. ఇప్పడు కీలక బౌలర్గా మారాడు.