అడిలైడ్: అడిలైడ్లో జరుగుతున్న డే/నైట్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఆడుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా (2/52), రవిచంద్రన్ అశ్విన్ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40)లు పదునైన బంతులతో ఆసీస్ బ్యాట్స్మన్ను బోల్తా కొట్టించారు. భారత బౌలర్ల దెబ్బకు రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 72.1 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ టిమ్ పైన్ (73 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. పైన్ 8వ వికెట్కు 28, 9వ వికెట్కు 28, 10వ వికెట్కు 24 పరుగులు జోడించి ఆసీస్ పరువు కాపాడాడు. మొత్తానికి తొలి టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది.
తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాను జస్ప్రీత్ బుమ్రా ఆదిలోనే కోలుకొని దెబ్బతీశాడు. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (8), రోరీ బర్న్స్ (8)ను ఔట్ చేశాడు. దీంతో లంచ్ విరామానికి ఆసీస్ 35/2తో నిలిచింది. ఆ తర్వాత స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ (1)ను ఆర్ అశ్విన్ తన తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ట్రావిస్ హెడ్ (7), కెమెరన్ గ్రీన్ (11)ను కూడా అశ్విన్ పెవిలియన్కు పంపించి ఆసీస్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పైన్తో కలిసి లబుషేన్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూనే పరుగులు సాధించారు. లబుషేన్ నెమ్మదిగా ఆడినా.. పైన్ కాస్త ధాటిగా ఆడాడు. లబుషేన్కు మూడు జీవనాధారాలు లభించాయి.
అర్ధశతకం దిశగా సాగుతున్న లబుషేన్ను ఉమేశ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో కమిన్స్ను కూడా ఉమేశ్ ఔట్ చేయడంతో ఆసీస్ 111 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో పైన్ పట్టుదలతో ఆడుతూ పరుగులు సాధించాడు. టెయిలెండర్లతో కలిసి బౌండరీలతో భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 72.1 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/55) తన మాయాజాలాన్ని ప్రదర్శించి కంగారూల పతనాన్ని శాసించాడు.
India vs Australia: డే/నైట్ టెస్టుపై కరోనా ఎఫెక్ట్.. మ్యాచ్ మధ్యలోనే వారు ఇంటికి!!