ఆరు వికెట్లు తీసిన షమీ
భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఆరు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు, ఇషాంత్ శర్మ వికెట్ తీశాడు. 132/4 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడింది. ఓవర్నైట్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖాజా, కెప్టెన్ టిమ్ పైన్లు నెమ్మదిగా ఆడుతూ వికెట్ను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
లంచ్ సమయం వరకూ వికెట్ పడలేదు
అదే క్రమంలో పరుగులపై కూడా దృష్టి సారించారు. దీంతో లంచ్ సమయం వరకూ టీమిండియా బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. ఆ తర్వాత పేసర్ షమీ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో ఆసీస్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. టిమ్ పైన్(37), అరోన్ ఫించ్(25), ఉస్మాన్ ఖవాజా(72)లను కొద్ది పాటి వ్యవధిలోనే పెవిలియన్కు పంపాడు.
తొలి బంతికే ఆరోన్ ఫించ్ ఔట్
జట్టు స్కోరు 192 వద్ద ఆసీస్ కెప్టెన్ టిమ్పైన్ (37) ఔటవగా.. ఆదివారం గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ తీసుకున్న అరోన్ ఫించ్ (25) సోమవారం మళ్లీ బ్యాటింగ్కి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతికే ఔటైపోయాడు. ఈ దశలో దూకుడు పెంచేందుకు ప్రయత్నించిన ఉస్మాన్ ఖవాజా (72) కూడా కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
వరుస బంతుల్లో పైన్, ఫించ్లను ఔట్ చేసిన షమీ
పైన్, ఫించ్లను వరుస బంతుల్లో ఔట్ చేసిన షమీ.. మరో మూడు ఓవర్లలోపే ఉస్మాన్ ఖవాజాను కూడా పెవిలియన్కు చేర్చాడు. గుడ్ లెంగ్త్, బౌన్సర్లు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులతో షమీ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బూమ్రా బౌలింగ్లో కమిన్స్(1) ఔట్ కావడంతో ఆసీస్ 198 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ను నష్టపోయింది.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 243 పరుగులకే ఆలౌట్
192 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్.. 198 పరుగుల వద్ద మరో రెండు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇక చివరి రెండు వికెట్లలో షమీ, బూమ్రాలు తలో వికెట్ సాధించడంతో ఆస్ట్రేలియా 243 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను ముగించింది. చివరి వికెట్కు స్టార్క్(14)- హెజెల్వుడ్(17 నాటౌట్)ల జోడి 36 పరుగులు జోడించారు.
|
భారత విజయ లక్ష్యం 287
దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే 241 ఆధిక్యంలో ఆ జట్టు ఉంది. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు 283 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్కి 43 పరుగుల ఆధిక్యం లభించింది. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు 31 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.