అంచనాల్ని తలకిందులు చేస్తూ:
గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకి అజేయ రికార్డ్ ఉండడంతో టీమిండియా డ్రా కోసం ప్రయత్నిస్తుందని అంతా ఊహించారు. కానీ సాహసోపేతంగా ఆడిన రహానే సేన.. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. యువ ఆటగాళ్లు పటిష్ట పేస్ దళాన్ని ఎదుర్కొని పరుగుల వరద పారించారు. శుభమన్ గిల్ (91: 146 బంతుల్లో 8x4, 2x6), రిషబ్ పంత్ (89 నాటౌట్: 138 బంతుల్లో 9x4, 1x6) సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. నయావాల్ చతేశ్వర్ పుజారా అడ్డుగోడగా నిలిచాడు. పుజారా 211 బంతులు ఆడి.. 56 రన్స్ చేశాడు.
ఇండియన్స్ను తక్కువ అంచనా వేయం:
టీమిండియా అనూహ్య విజయం సాధించడం ఆస్ట్రేలియన్లకు మింగుడుపడడం లేదు. మీడియా, ఆటగాళ్లు, మాజీలు, ఫాన్స్ అందరికి షాక్ గట్టిగానే తగిలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ... 'ఇదొక అద్భుతమైన టెస్ట్ సిరీస్. చివరికి ఒక విన్నర్, ఒక లూజర్ ఉండటం సహజమే. అయితే ఈసారి మాత్రం టెస్ట్ క్రికెట్ అసలైన విజేతగా నిలిచింది. ఇది మాకు చాలా పెద్ద దెబ్బే. క్రెడిటంతా ఇండియన్ టీమ్కే దక్కుతుంది. మేము ఈ సిరీస్ నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా భారతీయుల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. 150 కోట్ల భారతీయులలో 11 మందితో ఉన్న సీనియర్ టీమ్ని ఓడించడం చాలా కష్టం. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటైన భారత్ ఆ తర్వాత పుంజుకున్న తీరు అమోఘం' అని అన్నాడు.
తొలి ఆసియా జట్టుగా:
నాలుగు టెస్టుల ఈ సిరీస్ని 2-1తో గెలిచిన టీమిండియా.. ఆస్ట్రేలియా గడ్డపై రెండోసారి టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలోనూ 2-1తో భారత్ జట్టు సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అజింక్య రహానే జట్టును నడిపించగా.. గతంలో విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టాడు. అయితే రెండు సిరీసులలో కూడా చతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు. గబ్బా స్టేడియంలో 1988 నుంచి ఆస్ట్రేలియాకి టెస్టుల్లో ఓటమే లేదు. టీమిండియా కంగారూల పనిపట్టి గబ్బా కోటలు బద్దలు కొట్టింది.
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్