
సిడ్నీ: బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల ప్రారంభం అయిన మూడో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెషన్ ఆటకు వరణుడు పదేపదే అడ్డుపడ్డాడు. దీంతో ఆటగాళ్లు భోజన విరామ సమయాన్ని అరగంట ముందుగా తీసుకున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 21/1గా ఉంది. ఇప్పటికి కూడా సిడ్నీలో వర్షం భారీగానే పడుతోందని క్రిక్ బజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. మరో గంట పాటు మ్యాచ్ సాగే అవకాశాలు లేవని సమాచారం. ఒకవేళ వర్షం తగ్గకపోతే.. తొలి రోజు ఆట తుడుచిపెట్టుకుపోయే అవకాశం ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకొని తిరిగి మూడో టెస్టు ఆడుతున్న స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5)ను హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ బోల్తా కొట్టించాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వార్నర్ వేటాడడంతో స్లిప్లో చేటేశ్వర్ పూజారా చేతికి చిక్కాడు. దీంతో ఆ జట్టు 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వార్నర్ పూర్తిగా నిరాశపరిచాడు.
అనంతరం ఆరంగ్రేట ఆటగాడు విల్ పకోస్కీ (14)తో కలిసి స్టార్ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్ (2) బ్యాటింగ్ కొనసాగించాడు. వీరిద్దరూ 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగులు చేశారు. అదే సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. తొలి సెషన్లో కేవలం 7.1 ఓవర్ల పాటే మ్యాచ్ జరిగింది. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు బౌలింగ్ చేయగా.. మొహ్మద్ సిరాజ్ 3.1 ఓవర్లలో ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో పకోస్కీ (14), లబుషేన్ (2) పరుగులతో ఉన్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిర్ పొలోసాక్ పురుషుల టెస్ట్కు మ్యాచ్ అఫీషియల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్కు 32 ఏళ్ల క్లెయిర్ నాలుగో అంపైర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మ్యాచ్కు పాల్ రీఫెల్, పాల్ విల్సన్ ఫీల్డ్ అంపైర్లుగా.. బ్రూక్స్ ఆక్సెన్ఫర్డ్ టీవీ అంపైర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమీబియా-ఒమన్ల మధ్య 2019లో జరిగిన వన్డే మ్యాచ్కి పొలోసాక్ ఫీల్డ్ అంపైర్గానూ వ్యవహరించారు.