హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షో వివాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తనలో ఎంతో మార్పు తెచ్చాయని టీమిండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎల్ రాహుల్ని కొన్నాళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
రెండో టీ20లో భారత్ ఓటమి: సిక్సులతో సహా కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే
నిషేధం ఎత్తివేత తర్వాత ఆస్ట్రేలియాతో బుధవారంతో ముగిసిన రెండు టీ20ల సిరిస్లో తన ఫామ్ని అందుకున్నాడు. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో 50 పరుగులు చేసిన రాహుల్.. బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో 47 పరుగులు సాధించాడు. 'కాఫీ విత్ కరణ్' వివాదం తర్వాత తన టెక్నిక్, నైపుణ్యం పెరగడానికి రాహుల్ ద్రవిడే కారణమని చెప్పాడు.
"'కాఫీ విత్ కరణ్' టాక్ షో వివాదం తర్వాత నాలో అణకువ పెరిగింది. దేశానికి ఆడే అవకాశాన్ని గౌరవిస్తాను. వచ్చిన అవకాశాలను లెక్కలోకి తీసుకొని తలవంచుకొని క్రికెట్పై దృష్టిసారించా. కొద్దికాలం అంతర్జాతీయ క్రికెట్కి దూరమయ్యాను. కాస్త ఒత్తిడి తక్కువగా ఉండే భారత్-ఏ తరఫున ఆడా. నా టెక్నిక్, నైపుణ్యంపై దృష్టి సారించా" అని రాహుల్ అన్నాడు.
"ఈ సమయంలో ఎక్కువగా రాహుల్ ద్రవిడ్తో గడిపా. ఆయనతో నా ఆట గురించి చర్చించా. భారత్-ఏకు ఆడిన ఐదు మ్యాచుల్లో ఆయన నాకెంతో సాయపడ్డారు. తిరిగి సహచరులతో కలిసినందుకు సంతోషంగా ఉంది. కెరీర్ తొలినాళ్లలోనే వివాదంలో చిక్కుకోవడం వల్ల నేర్చుకొనే అవకాశం దొరికింది" అని కేఎల్ రాహుల్ అన్నాడు.
"ఒక క్రికెటర్గా ఇప్పుడు నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. పునరాగమనం తర్వాత నాపై ఒత్తిడి నెలకొంది. పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది. చిన్నస్వామిలో చేధన చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. మాక్స్వెల్ ఇన్నింగ్స్ అద్భుతం. తడిచిన బంతితో వికెట్లు తీసేందుకు మన బౌలర్లు కష్టపడ్డారు" అని రాహుల్ తెలిపాడు.