13 మంది ఆటగాళ్లు ఇప్పటికే ఖరారు
పదిహేను మందిలో 13 మంది ఆటగాళ్లు ఇప్పటికే ఖరారైపోయినట్టు సమాచారం. కేవసం రెండు స్థానాలపైనే సెలక్టర్లు నిర్ణయించుకోవాల్సి ఉంది. అందులో ఒకటి రెండో వికెట్కీపర్ స్థానం కాగా.. మరొకటి లెఫ్టార్మ్ పేసర్ బెర్తు. రెండో వికెట్కీపర్ కోసం రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. మరోవైపు యువ పేసర్ ఖలీల్ అహ్మద్ నిలకడలేమి దృష్ట్యా అనుహ్యంగా తెరపైకి జయదేవ్ ఉనాద్కత్ పేరు వచ్చింది.
రేసులోకి జయదేవ్ ఉనాద్కత్
ప్రస్తుత రంజీ సీజన్లో సౌరాష్ట్రకు కెప్టెన్గా వ్యవహరించిన జయదేవ్ జట్టు ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో వేగం పెరగడంతో పాటు వైవిధ్యం కనిపిస్తుండటంతో ప్రపంచ కప్ రేసులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో ఆడిన ఖలీల్ అహ్మద్ ఇంకా మెరుగవ్వాల్సి ఉండటం ఉనాద్కత్ పేరు రేసులోకి వచ్చింది.
వరల్డ్కప్కు నాలుగో పేసర్ అవసరం
వరల్డ్కప్కు నాలుగో పేసర్ అవసరం రావడంతో జయదేవ్ ఉనాద్కత్, ఖలీల్ అహ్మద్ల మధ్య గట్టిపోటీ నెలకొంది. 2010లో అరంగేట్రం చేసిన ఉనాద్కట్ ప్రస్తుతం చాలా పరిణతి చెందాడు. బంతుల్లో భిన్నత్వాన్ని, వేగాన్ని రాబట్టడంలో నిపుణుడిగా మారాడు. ఐపీఎల్లోనూ ఉనాద్కట్కు మంచి రికార్డే ఉంది. వన్డే వరల్డ్కప్నకు ముందు ఇదే చివరి సిరీస్ కావడంతో వీరిద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై సెలెక్షన్ కమిటీ కసరత్తులు మొదలుపెట్టింది.
రెండో వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్?
అలాగే రెండో వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్లలో సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారో ఆసక్తి రేకిత్తిస్తోంది. సాధారణంగా 15 మంది సభ్యులను ప్రకటించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి వరల్డ్కప్ సన్నాహకాల్లో భాగంగా 16 లేదా 17 మందితో జట్టును ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. దీంతో జట్టు మేనేజ్మెంట్ ఆలోచనలకు అనుగుణంగా మరో రెండు స్థానాలకు నలుగుర్ని తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మూడో ఓపెనర్గా కేఎల్ రాహుల్ స్థానం ఖాయం
మూడో ఓపెనర్గా కేఎల్ రాహుల్ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. టి20ల్లో అతడు ధావన్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. ఇంగ్లండ్ లయన్స్పై మంచి ఇన్నింగ్స్లు ఆడటం రాహుల్కు అవకాశం వచ్చేలా చేసింది. ఇక ధోనికి బ్యాకప్ కీపర్గా యువ రిషభ్ పంత్, సీనియర్ దినేశ్ కార్తీక్లలో ఎవరివైపు మొగ్గు చూపుతారనేది కూడా ఈ సిరీస్లో తేలనుంది.