
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో తుది జట్టు ఎంపికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం నెలకొంటూనే ఉంది. ప్రతి టెస్టుకు తుది జట్టులో ఏదో ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగుతోంది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా గురువారం నుంచి సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్టుకు ఎంపిక చేసిన తుది జట్టుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురువారం నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో ఫామ్లో లేని కేఎల్ రాహుల్కు మరోసారి సెలక్టర్లు అవకాశమిచ్చారు. తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలం కావడంతో ఓపెనర్లు విజయ్, రాహుల్లను మూడో టెస్ట్ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
అయితే, నాలుగో టెస్టులో మురళీ విజయ్పై వేటు వేసినప్పటికీ, కేఎల్ రాహుల్కు మాత్రం మరో అవకాశమిచ్చారు. ఇది ఎంతమాత్రం నచ్చని క్రికెట్ అభిమానులు కేఎల్ రాహుల్ను ఎందుకు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలను ట్రోల్ చేస్తున్నారు.
'సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.. నాలుగో టెస్ట్లో స్కోరు 0/1గా ఉంటుంది' అంటూ కేఎల్ రాహుల్ గురించి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 'టీమ్లోకి ఎంపిక చేయడానికి మంచి ప్రదర్శన ప్రామాణికం కాదా.. చూడటానికి కాస్త బాగుంటే చాలా' అంటూ మరోక అభిమాని తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
'కోచ్ ఫేవరెట్ అయితే సరిపోదు.. అందరూ కష్టపడి తుది జట్టులో చోటు సంపాదించాల్సిందే' అని మరోక అభిమాని ట్వీట్ చేయగా... 'కోహ్లి, రవిశాస్త్రి ఫేవరెట్ కాబట్టి రాహుల్ను బీసీసీఐ దత్తత తీసుకున్నదంటూ' మరో అభిమాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు.
సిడ్నీ టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవీంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్