టాప్ ఆర్డర్ ఆడితేనే:
ఓపెనర్లు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తున్నారు. ధావన్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడగా.. మయాంక్ బాకీ ఉన్నాడు. ఇద్దరూ మంచి శుభారంభం ఇవ్వాలని టీమిండియా కోరుకుంటోంది. ఆస్ట్రేలియా జట్టుపై కెప్టెన్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డు లేదు. అయితే గత ఇన్నింగ్స్తో కోహ్లీ టచ్లోకి వచ్చాడు. భారత్ పరువు నిలుపుకోవాలంటే కోహ్లీ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2020లో పరుగుల వరద పారించినా.. సిడ్నీలో మాత్రం తేలిపోయాడు. కేఎల్ రాహుల్ కూడా గత మ్యాచులో పరుగులు చేసినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. శ్రేయాస్, రాహుల్ ఇద్దరూ ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు.
జట్టులోకి నటరాజన్:
తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా 76 బంతుల్లో 90 పరుగులతో గొప్పగా పోరాడాడు. అయితే హార్దిక్ బౌలింగ్కు దూరంకావడంతో జట్టులో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇక రెండో వన్డేలో బ్యాటింగ్లో తేలిపోయినా.. బౌలింగ్ చేసి కాస్త పర్వాలేదనిపించాడు. ప్రపంచ క్రికెట్లోనే మేటిగా నిలిచిన భారత బౌలింగ్ దళం గత రెండు వన్డేల్లో వరుసగా 374, 389 పరుగులు సమర్పించుకుంది. పేసర్ నవదీప్ సైనీ ప్రదర్శన తీసికట్టుగా మారింది. దీంతో రేపటి మ్యాచ్లో సైనీ స్థానంలో నటరాజన్ జట్టులోకి రావడం ఖాయమనిపిస్తోంది. ఐపీఎల్లో యార్కర్లతో గొప్ప ప్రదర్శన చేసిన అతడు బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగలడు. పిచ్ అనుకూలిస్తే బంతిని స్వింగ్ చేస్తూ సవాళ్లు విసురుతాడు. అతడి రాకతో ఆసీస్ స్కోరును భారత్ కట్టడి చేయొచ్చు.
విశ్రాంతి ఇవ్వాలనుకుంటే:
మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరిలో ఒక్కరికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్ త్వరలోనే ప్రారంభం కానున్నందున మూడో వన్డేలో బుమ్రా, షమీకి విశ్రాంతి ఇవ్వాలని కెప్టెన్ భావిస్తే.. శార్దుల్, నటరాజన్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తొలి రెండు మ్యాచ్ల్లో 19 ఓవర్లు బౌలింగ్ చేసి 160 రన్స్ సమర్పించుకొని కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. చహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడని అంచనా. కానీ రవీంద్ర జడేజా 6.15 ఎకానమీతో పరుగులు ఇచ్చినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. అందరూ సమిష్టిగా రాణిస్తేనే టీమిండియా తిరిగి గెలుపుబాట పడుతుంది.
ఓపెనర్గా లబుషేన్:
ఫామ్లో ఉన్న డేవిడ్ వార్నర్ గాయంతో పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమవ్వడం టీమిండియాకు సానుకూలాంశం. వార్నర్ స్థానంలో లబుషేన్ ఓపెనర్గా బరిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదిలోనే భారత్ వికెట్లు సాధిస్తే ఆసీస్పై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఫించ్, స్మిత్ను త్వరగా పెవిలియన్కు చేర్చితేనే ఆస్ట్రేలియా ఆత్మరక్షణ ధోరణీలో ఆడుతుంది. లేనిపక్షంలో మరోసారి పరుగుల వరద ఖాయం. ఇక మాక్స్వెల్ దూకుడును అడ్డుకుంటే భారత్ పోటీలో నిలుస్తుంది. బౌలర్లు కూడా బాగా రాణిస్తుండడం ఫించ్ సేనకు కలిసొచ్చే అంశం. మొత్తానికి ఆస్ట్రేలియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ/శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మర్కస్ స్టోయినిస్, అలెక్స్ కేరీ, హెన్రిక్స్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోష్ హేజిల్వుడ్.