మార్పులు ఉండకపోవచ్చు
రెండో వన్డేలో కూడా టీమిండియా మార్పులు చేయకపోవచ్చు. తొలి వన్డే విన్నింగ్ కాంబినేషన్ను మార్చేందుకు జట్టు మేనేజ్మెంట్ సుముఖంగా లేదని తెలుస్తోంది. హైదరాబాద్ వన్డేలో ధవన్ విఫలమైనా అతన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కేఎల్ రాహుల్ మరోమారు బెంచ్కే పరిమితం కానున్నాడు. నాయక ద్వయం రోహిత్శర్మ, కోహ్లీ గత వన్డేలో మెరుపులు మెరిపించలేకపోయారు. తనదైన రోజైన ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని హిట్మ్యాన్ చెలరేగితే ఆసీస్కు కష్టాలు ఎదురైనట్లే.
నాగ్పూర్లో చెలరేగితే
ఇక కెప్టెన్ కోహ్లీ ఇటీవలి కాలంలో తన స్కోర్లను భారీగా మలుచుకోలేకపోతున్నాడు. తన చివరి ఐదు వన్డేల్లో 46, 45, 43, 60, 44 పరుగులు సాధించాడు. వీరిద్దరూ నాగ్పూర్లో చెలరేగితే ప్రత్యర్థికి చుక్కలు కనిపించడం ఖాయం. అంబటి రాయుడు స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా అతడి చోటుకు ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. రాయుడు సామర్థ్యంపై నమ్మకం పెట్టుకున్న మేనేజ్మెంట్ అవకాశాలు ఇస్తూ పోతుంది.
సూపర్ ఫామ్లో ధోని
వరుసగా నాలుగో హాఫ్ సెంచరీతో ధోనీ జోరుమీదున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తనను మించిన మ్యాచ్ ఫినిషర్ మరొకరు లేరని నిరూపిస్తూ జాదవ్తో కలిసి జట్టుకు విజయాన్నందించాడు. బ్యాటింగ్ పరంగా బౌలింగ్లోనూ రాణిస్తూ కీలక ఆటగానిగా మారిన కేదార్ జాదవ్ తన సత్తాఏంటో రుజువు చేసుకుంటున్నాడు. పార్ట్టైమ్ స్పిన్నర్గా మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రిస్తూ వైవిధ్యమైన బౌలింగ్తో వికెట్లు నేలకూలుస్తున్నాడు.
బౌలింగ్ విషయానికొస్తే
బౌలింగ్ విషయానికొస్తే.. షమీ సూపర్ఫామ్తో అదరగొడుతుండగా, బుమ్రా తనదైన శైలిలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు చుక్కలు చూపిస్తున్నారు. నాగ్పూర్ వన్డేలో చైనామన్ కుల్దీప్యాదవ్ను తప్పించి చాహల్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్లో తడబడుతున్నా.. ఆల్రౌండర్ విజయ్ శంకర్ స్థానంలో రిషబ్ పంత్ను ఆడించే ఉద్దేశంలో జట్టు మేనేజ్మెంట్ ఉంది.
ఆందోళనకు గురి చేస్తోన్న ఆరోన్ ఫించ్ ఫామ్
కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫామ్ జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురి చేస్తున్నది. గత మూడు మ్యాచ్ల్లో 0, 8, 0 స్కోర్లకు పరిమితమైన ఫించ్..జట్టుకు భారంగా మారిపోయాడు. గత 20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఫించ్కు ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మిడిల్లో మ్యాక్స్వెల్, హ్యాండ్స్కోంబ్, స్టోయినిస్ తలో చేయి వేస్తే కంగారూలకు సమస్యలు తీరినట్లే. ఆస్టన్ టర్నర్ స్థానంలో సీనియర్ షాన్ మార్ష్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది.
రెండో వన్డేలో మార్ష్
మార్ష్ రాకతోనైనా ఆసీస్ బ్యాటింగ్ సమస్యలు తీరుతాయో చూడాలి. బౌలింగ్లో కౌల్టర్నైల్, ఆడమ్ జంపా రాణిస్తు న్నా... బెహెన్డార్ఫ్, కమ్మి న్స్, స్టోయినిస్ నుంచి సహకారం లభించడం లేదు. ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా భారత్ను ఇబ్బంది పెట్టగలిగాడు. నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో ఆడిన మూడు మ్యాచ్ల్లో భారత్నే విజయం వరించింది. 2009లో 99 పరుగులు, 2013లో 6 వికెట్లు, 2017లో ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు గెలిచింది.
జట్ల వివరాలు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కోహ్లీ, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, జడేజా, షమి, కుల్దీప్ యాదవ్, బుమ్రా.
ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, ఫించ్, షాన్ మార్ష్, స్టొయినిస్, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్వెల్, క్యారీ, కల్టర్ నైల్, కమిన్స్, బెహ్రెన్డార్ఫ్, ఆడమ్ జంపా.
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో..