

హైదరాబాద్: భారత్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి ఆప్ఘనిస్థాన్ అరంగేట్ర మ్యాచ్ కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ జట్టుకు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.
"ఆప్ఘనిస్థాన్ జట్టు తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ని ఆడుతున్న సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు. చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ కోసం ఇండియాను ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇరు జట్లకు అభినందనలు. క్రీడలు ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలను నెలకొనేందుకు దోహదపడుతున్నాయి" అని ట్వీట్ చేశారు.
మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అఫ్ఘనిస్థాన్ జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్లో ఓ లేఖను అభిమానులతో పంచుకుంది. "ఆప్ఘనిస్థాన్ తమ అరంగ్రేట టెస్టు మ్యాచ్ భారత్తో ఆడటం గొప్ప గర్వకారణం. యువకులతో కూడిన వారి జట్టు అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో చోటుదక్కించుకోవడం అభినందనీయం. గతేడాది అప్ఘన్ జట్టుకు టెస్టు హోదా దక్కింది. వారి ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగింది" అని చెప్పుకొచ్చారు. లేఖలో సారాంశాన్ని మ్యాచ్ ముందు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చదివారు.
కాగా, ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అతిఫ్ మషాల్ కూడా అఫ్గాన్ ప్రధాని అష్రాఫ్ ఘని పంపిన ప్రకటనను చదివారు. దీనిలో భాగంగా "భారత్తో అరంగ్రేట టెస్టు ఆడుతున్న అఫ్ఘన్ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. ఇందుకు నాకు గర్వంగా ఉంది. ఏదో ఒక రోజు ఈ జట్టు ప్రపంచలోనే అత్యుత్తమ జట్టుగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది ఒక చరిత్రాత్మక రోజు. అఫ్ఘన్ క్రికెట్ అభివృద్ధిలో తోడ్పాటునందిస్తున్నందుకు బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా ఐసీసీ టెస్టు సభ్యదేశాలు కూడా అఫ్గానిస్థాన్తో టెస్టు మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను" అని అఫ్ఘన్ ప్రధాని ప్రకటనలో పేర్కొన్నారు.