హైదరాబాద్: జట్టులో మిగతా సభ్యుల్లాగానే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను చూస్తానని భారత జట్టు అండర్-19 బౌలింగ్ కోచ్ సనత్ కుమార్ వెల్లడించాడు. త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టులో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అందరి దృష్టి అర్జున్పైనే ఉంది. ఈ నేపథ్యంలో బౌలింగ్ కోచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ "జట్టులో మిగతా సభ్యుల్లాగే అర్జున్ కూడా. కోచ్గా నాకు జట్టులోని ఆటగాళ్లంతా ఒకటే. నా వరకు అర్జున్ ఏమీ ప్రత్యేకం కాదు. జట్టులోని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా చూడటమే నా బాధ్యత" అని అన్నాడు.
"జట్టు ఓవరాల్ ప్రదర్శన ఎలా ఉందనేది దానికి ప్రాముఖ్యత. అంతేకానీ ఇక్కడ ప్రత్యేకించి ఆటగాళ్లను వేరు చేసి చూడటం ఉండదు. 2008లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టుకు కోచ్గా పనిచేశాను. ఇప్పుడు అండర్-19 భారత పురుషుల జట్టుకు కోచ్గా బాధ్యతలు తీసుకున్నా" అని పేర్కొన్నాడు.
"ఈ ఏడాది అక్టోబరులో బంగ్లాదేశ్లో జరిగే అండర్-19 ఆసియా కప్ వరకు నేను కోచ్గా ఉంటాను. ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని మంచి ప్రదర్శన చేసేలా వారికి కోచింగ్ ఇస్తా" అని సనత్ కుమార్ తెలిపాడు. జులై 12 నుంచి శ్రీలంకలో భారత్ పర్యటన ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో భారత్... ఆతిథ్య శ్రీలంక అండర్-19 జట్టుతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లు రెండు, ఐదు వన్డేలు ఆడనుంది.