పేలవ ఆరంభం:
హెట్మెయిర్ మధ్యతరగతి కుటుంబంకు చెందిన వాడు. చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తొమ్మిదేళ్ల వయసులో పాఠాశాల స్థాయిలో మంచి ప్రదర్శన చేసాడు. 2014 అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చేశాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు సార్లు సింగల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ తొలి మ్యాచ్లో 0, 4 పరుగులు మాత్రమే చేశాడు.
తొలి కెప్టెన్గా చరిత్ర:
హెట్మెయిర్ మరింత కసితో శ్రమించాడు. దీంతో 2016 ప్రపంచకప్ అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. మంచి నాయకత్వంతో విండీస్ జట్టును విజేతగా నిలిపాడు. క్వార్టర్, సెమీ ఫైనల్లో అర్ధ శతకాలు బాది విండీస్ టైటిల్ గెలవడంలో హెట్మెయిర్ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వెస్టిండీస్కు అండర్-19 ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు.
జాతీయ జట్టులోకి చోటు:
2016 కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సీజన్లో గయానా అమెజాన్ వారియర్స్ హెట్మెయిర్ను సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఆ మ్యాచ్లో కూడా ఖాతా తెరవకముందే పెవిలియన్కు చేరాడు. కొన్ని మంచి ప్రదర్శనల తర్వాత వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. 2017లో స్వదేశంలో పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. మూడు టెస్టుల్లో కేవలం 96 పరుగులే చేసాడు.
యూఏఈపై తొలి సెంచరీ:
పరుగులు చేయలేకపోయినా హెట్మెయిర్పై ఉన్న నమ్మకంతో న్యూజిలాండ్ పర్యటనకు విండీస్ బోర్డు ఎంపిక చేసింది. అర్ధ శతకం బాది ఫర్వాలేదనిపించాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో తేలిపోయాడు. ఆ తర్వాత యూఏఈపై తొలి సెంచరీ చేసాడు. 2018లో బంగ్లాదేశ్ సిరీస్లోనూ ఆకట్టుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇక టీమిండియాతో జరిగిన సిరీస్తో హెట్మెయిర్ కెరీర్ మలుపు తిరిగింది. టీ20 తరహాలో వన్డేల్లో చెలరేగాడు.
విశాఖలో విధ్వంసం:
2018లో వెస్టిండీస్ భారత్లో పర్యటించింది. టెస్టు, టీ20, వన్డేల సిరీస్లను టీమిండియా కైవసం చేసుకుంది. కానీ వన్డేల్లో హెట్మెయిర్ విధ్వంసం సృష్టించాడు. తొలి వన్డేలో 78 బంతుల్లో 106 పరుగులు బాదాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ హెట్మెయిర్ అద్భుతంగా పోరాడాడు. 64 బంతుల్లోనే 94 పరుగులు బాదాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ సంవత్సరం కూడా దుమ్ములేపుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న భారత పర్యటనలోనూ హెట్మెయిర్ చెలరేగుతున్నాడు.
వేలంలో భారీ ధర:
ఈ సంవత్సరం అద్భుత ప్రదర్శన చేయడంతో ఈ ఐపీఎల్ వేలంలో హెట్మెయిర్లకు భారీ ధర పలికింది. రూ.7.75 కోట్లకు హెట్మెయిర్ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. హెట్మెయిర్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. భారీ ధరకు అమ్ముడుపోవడంతో హోటల్ గదిలోనే అతడు చిందేశాడు. వేలంను లైవ్ ద్వారా చూస్తున్న హెట్మెయిర్.. తనను ఢిల్లీ భారీ మొత్తంలో కనుగోలు చేయడంతో సంతోషంలో చిందులేశాడు.