ఢిల్లీ: 2019 వన్డే ప్రపంచకప్లో ఓడిపోవడం ఇప్పటికీ ఇప్పటికీ బాధిస్తోందని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. ప్రపంచకప్ గెలవాలంటే చక్కని ప్రణాళిక రచించి పక్కగా అమలు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. క్రికెటర్లు రాష్ట్ర సంఘాల మైదానాలను ఉపయోగించుకోవాలని కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నారు. పరుగు, నైపుణ్యాలపై దృష్టి సారించాలని సూచించారు.
ఒకే ఇన్నింగ్స్లో 501 పరుగులు.. లారా రికార్డుకు 26ఏళ్లు!!
కరోనా వైరస్ లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ అంతరాష్ట్ర ప్రయాణాలు ఇంకా మొదలవ్వలేదు. దీంతో ఒకే చోట శిబిరం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అందుకే సొంత మైదానాలను ఉపయోగించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ... ఆటగాళ్లు తిరిగి మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు కనీసం నెల రోజులు పడుతుందని అరుణ్ అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి ఆటగాళ్లు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే.
'ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్లకు ఫిట్నెస్ సాధించాలంటే.. కనీసం 6-8 వారాల సమయం పడుతుంది. శిక్షణ శిబిరాల్లో మేం మొదట నైపుణ్యాలు, ఫిట్నెస్పై దృష్టిపెడతాం. మ్యాచ్ సిమ్యులేషన్లను ఉపయోగిస్తాం. అంతర్జాతీయ మ్యాచులకు ముందే బీసీసీఐ ఒక టోర్నీ ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉంది. అది ఆటగాళ్లకు ఎంతో సాయపడుతుంది' అని భరత్ అరుణ్ తెలిపారు.
'బౌలర్ల గురించి నేను అతిగా బెంగపడటం లేదు. ఎందుకంటే.. విశ్రాంతి తీసుకోవడానికి రెండు నెలల కన్నా ఎక్కువ సమయం దొరికింది. చాలా అరుదుగా అంతర్జాతీయ క్రికెటర్లకు.. ప్రత్యేకించి బౌలర్లకు ఇలాంటి విరామం దొరుకుతుంది. గాయాల నుంచి కోలుకొనేందుకు ఇది సరైన సమయం' అని అని అరుణ్ చెప్పారు.
ఇంగ్లండ్ వేదికగా గతేడాది జరిగిన ప్రపంచకప్ ఓటమి గురించీ అరుణ్ మాట్లాడారు. మెగాటోర్నీలో ఓడిపోవడం ఇప్పటికీ బాధిస్తోందని అన్నారు. టోర్నీకి బాగా సన్నద్ధం అయ్యాయమన్నారు. లీగ్ దశ మొత్తం అద్భుతంగా ఆడామన్నారు. ఏదేమైనప్పటికీ ప్రపంచకప్ గెలవాలంటే చక్కని ప్రణాళిక రచించి పక్కగా అమలు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.