కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ "భారత్ పర్యటన నిరాశను మిగల్చలేదనే అనుకుంటున్నాను. మేము ఇక్కడ చాలా బాగా ఆడాం. జట్టులోని యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. మా వాళ్ల పోరాట పటిమను చూసి గర్విస్తున్నా. ఈ ద్వైపాక్షిక సిరీస్లు మమ్మల్ని ఎక్కువ నిరూత్సాహ పరచలేదు. మేము బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించాం" అని అన్నాడు.
అత్యుత్తమ జట్టు ఆట ఎలా ఉంటుందో
"ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఆట ఎలా ఉంటుందో మాకు చూపించారు. అత్యుత్తమ జట్టు ఎలా ఆడాలో అలాగే టీమిండియా ఆడింది. నంబర్ వన్ జట్టు అని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. భారత్ జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆడి సిరీస్లను కైవసం చేసుకుంది. భారత పర్యటన ద్వారా మా జట్టులో ఉన్నటాలెంట్ను మరొకసారి గుర్తించాం" అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.
యువ ఆటగాళ్లు రాణించారు
"హెట్ మెయిర్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, షెల్డన్ కాట్రెల్లు చక్కటి ప్రదర్శన చేశారు. ఇదే ప్రదర్శనను వారు రాబోవు సీజన్లలో కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. నాకు మాత్రం ఇదొక మంచి సిరీస్గా మిగిలి పోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించాం. అందులో మేము సక్సెస్ అయ్యామనే అనుకుంటున్నాను" అని కీరన్ పొలార్డ్ పేర్కొన్నాడు.
4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
మూడు వన్డేల సిరీస్లో భాగంగా బారాబతి స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇన్నింగ్స్ చివరలో పేసర్ శార్దూల్ ఠాకూర్ సూపర్ ఇన్నింగ్స్కు తోడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయడంతో మరో ఎనమిది బంతులు మిగులుండగానే టీమిండియా గెలిచింది. ఈ విజయంతో 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది.