ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం వెస్టిండీస్తో కోల్కతా వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సంజూ శాంసన్ అసాధారణ బ్యాటింగ్తో ఆపద్భాందవుడయ్యాడు. అభిషేక్, ఇషాన్, తిలక్, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ అందరూ కట్టకట్టుకొని విఫలమైన వేళ.. తానొక్కడే నిలబడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ గెలుపుతో టీమిండియా సెమీఫైనల్కు అర్హత సాధించింది. దాంతో సంజూ శాంసన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతా సంజూ గురించే మాట్లాడుతున్నారు.

అయితే సంజూ గాలిలో గౌతమ్ గంభీర్ చేసిన ఘోర తప్పిదం కొట్టుకుపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయి ఉంటే గంభీర్ చేసిన ఈ వ్యూహాత్మక తప్పిదంపై తీవ్ర విమర్శలు వచ్చేవి. మైదానం బయట నుంచి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు అతను ఇచ్చిన సలహా మిస్ఫైర్ అయ్యింది. వెస్టిండీస్ బ్యాటింగ్ సందర్భంగా 15వ ఓవర్ అనంతరం వరుణ్ చక్రవర్తీతో బౌలింగ్ చేయించాలని సూర్య భావించగా.. అర్ష్దీప్ సింగ్తో వేయించాలని గంభీర్ డగౌట్ నుంచి మెసేజ్ పంపించాడు.
వాషింగ్టన్ సుందర్ ద్వారా సూర్యకు తెలియజేశాడు. కానీ ఈ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఓవర్లో తొలి మూడు బంతులు కట్టు దిట్టంగా వేసిన అర్ష్దీప్ సింగ్ నాలుగో బంతిని వైడ్గా వేయగా బౌండరీ వెళ్లిపోయింది. నాలుగో బంతిని పోవెల్ సిక్స్ బాదగా.. అర్ష్దీప్ సింగ్ మరో వైడ్ వేసాడు.
చివరి రెండు బంతులను పోవెల్ సిక్స్, ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్ చేసి ఉంటే ఇన్ని పరుగులు వచ్చేవి కావు. మ్యాచ్ను నిశితంగా చూసిన వారికి గంభీర్ చేసిన ఈ తప్పిదం గురించి తెలుస్తోంది. సంజూ దయవల్ల ఈ మ్యాచ్లో భారత్ గెలిచింది. లేదంటే ఈ ఓవర్ గేమ్ మూమెంటమ్గా మారేది.