టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అలాగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా కూడా సంజూ శాంసన్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డులను సంజూ శాంసన్ అధిగమించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వెస్టిండీస్తో కోల్కతా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 నాటౌట్)అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ ఛేజింగ్లో టాప్ స్కోర్ కోహ్లీ పేరిట ఉండేది. అతను టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్పై, 2016 టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై ఛేజింగ్లో 82 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్ తరహాలోనే ఈ రెండు మ్యాచ్ల్లో కోహ్లీ భారత్కు విజయాన్నందించాడు. తాజా మ్యాచ్లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచి కోహ్లీని వెనక్కినెట్టాడు. ఈ మ్యాచ్లో 16 బౌండరీలతో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు బాదిన రోహిత్ శర్మ(15)ను రికార్డును అధిగమించాడు.

రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 15 బౌండరీలు బాదగా.. సంజూ శాంసన్ తాజా ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తం 16 బౌండరీలు బాది హిట్ మ్యాన్ను అధిగమించాడు. సురేశ్ రైనా తర్వాత టీ20 ప్రపంచకప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన రెండో భారత బ్యాటర్గా సంజూ శాంసన్ నిలిచాడు. 2010 టీ20 ప్రపంచకప్లో సురేష్ రైనా(60 బంతుల్లో 101) సౌతాఫ్రికాపై సెంచరీతో చెలరేగాడు. పొట్టి ప్రపంచకప్లో భారత్ తరఫున సెంచరీ బాదిన ఏకైక బ్యాటర్ కూడా సురేష్ రైనానే కావడం గమనార్హం.
గురువారం వాంఖడే వేదికగా జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. సంజూ శాంసన్ సూపర్ ఫామ్ నేపథ్యంలో అభిషేక్ శర్మను తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి సంజూ శాంసన్ కెరీరే ఉదాహరణ. ఈ మెగా టోర్నీకి ముందు సంజూ పేలవ ఫామ్తో ఇబ్బంది పడ్డాడు. ఐదు మ్యాచ్లకు ఐదింటిలో విఫలమయ్యాడు. చివరకు తుది జట్టులో చోటు కోల్పోయాడు. కానీ అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అసలు సిసలు మ్యాచ్లో సత్తా చాటాడు. జీవితానికి సరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
