న్యూ ఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఒక్క పైసా చెల్లించదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తమతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడనందుకు బీసీసీఐ రూ.447 కోట్లు పరిహారం చెల్లించాలని పీసీబీ ఐసీసీలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణను ఐసీసీ అక్టోబర్ 1 నుంచి చేపట్టనుంది.
'భారత్కు పీసీబీకి ఒక్కపైసా చెల్లించదు. ఏళ్ల తరబడి చాలా దేశాలు పాకిస్థాన్లో పర్యటించలేదు. మ్యాచ్లు ఆడలేదు. ఐసీసీ విచారణకు భారత్ తరఫున అధికారులెవరూ హాజరుకారని అనుకుంటున్నా' అని ఠాకూర్ అన్నారు.
ఆసియా కప్ పోరులో యువ భారత్ జోరు
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'నాకు తెలిసినంత వరకు ఈ వివాదాన్ని పీసీబీ, బీసీసీఐ పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఐసీసీ జోక్యం అవసరం లేదు. పాక్తో ఆడాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. కొన్ని కారణాల వల్ల పాక్తో ఆడేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం అవుతోంది. తటస్థ వేదికల విషయానికి వస్తే ఆసియా, ఐసీసీ ట్రోఫీల్లో పాక్తో భారత్ తలపడుతూనే ఉంది. పాక్కు డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదు' అని శుక్లా అన్నారు.
ఉగ్రవాదులకు మద్దతిచ్చే చర్యలను పాక్ ఆపితే.. ఆ తర్వాత ఆ దేశంతో క్రికెట్ ఆడే విషయం ఆలోచిస్తాం' అని బీజేపీ ఎంపీ కూడా అయిన అనురాగ్ అన్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ టోర్నీలో భారత్తో తలపడిన పాక్ రెండు వన్డేలలోనూ(గ్రూపు దశ, సూపర్ ఫోర్ దశలోనూ) ఘోరంగా ఓడిపోయింది.