
హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి శుభారంబాన్ని ఇవ్వలేకపోయాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ముగిసిన రెండు టీ20ల్లో ధావన్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, తొలి టీ20లో కేఎల్ రాహుల్ సెంచరీ, బౌలింగ్లో కుల్దీప్ రాణించడంతో విజయం సాధించింది.
శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో కోహ్లీసేనపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలి ఆరు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఓటమిపాలైంది. తాజా ఓటమితో మూడు టీ20ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కీలకంగా మారింది.
కాగా, శుక్రవారం జరిగిన రెండో టీ20లో శిఖర్ ధావన్ అద్భుతమైన ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓటమి నిరాశ కలిగించినప్పటికి అభిమానులకు ఈ క్యాచ్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సిక్స్ వెళ్లే బంతిని ధావన్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి మరి అద్భుతంగా అందుకున్నాడు.
ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వేసిన 14 ఓవర్ తొలి బంతిని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో సిక్స్ అని అందరూ భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న ధావన్ అనూహ్యంగా ఆ బంతిని అందుకోని ఆశ్చర్యపరిచాడు. దీంతో మైదానంలో ఆటగాళ్లు, ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు.
ధావన్ ఫీల్డింగ్కు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. "అరే ఎం క్యాచ్.. కబడ్డీలో ఇలాంటి ఫీట్స్ చేస్తారు" అని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.