23 పాయింట్లతో భారత్ అర్హత:
వన్డే చాంపియన్షిప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో గతేడాది జూలై, నవంబర్లో జరుగాల్సిన సిరీస్ రద్దు కావడంతో భారత్కు లైన్ క్లియర్ అయ్యింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్తో సిరీస్ ఆడేందుకు భారత జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే పాక్తో సిరీస్ ఆడకపోవడానికి గల కారణాలపై బీసీసీఐ న్యాయవాదులు ఇచ్చిన వివరణతో ఐసీసీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఇక కరోనా వైరస్ కారణంగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా, శ్రీలంక-న్యూజిలాండ్ సిరీస్లు కూడా వాయిదా పడడంతో ఈ జట్లకు కూడా పాయింట్లు పంచారు. దీంతో చాంపియన్షిప్ పట్టికలో భారత్ 23 పాయింట్లతో ప్రపంచకప్కు అర్హత సాధించింది.
నాలుగు జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత:
ఆతిథ్య న్యూజిలాండ్ (17), పాయింట్ల పట్టికలో అత్యుత్తమ స్థానాల్లో ఉన్న మరో నాలుగు జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. భారత్ 23 పాయింట్లతో ఉండగా.. ఆస్ట్రేలియా (37), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25)లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్లో ప్రతి జట్టూ.. మరో జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడాలి. వచ్చే ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 మధ్య న్యూజిలాండ్లో ఈ మెగా టోర్నీ జరగనుంది.
శ్రీలంకలో క్వాలిఫయింగ్ టోర్నీ:
పాకిస్థాన్ (19), న్యూజిలాండ్ (17), వెస్టిండీస్ (13), శ్రీలంక (5) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఆతిథ్య హోదాలో టోర్నీలో ఆడే హక్కు న్యూజిలాండ్కు దక్కింది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీలోని మిగతా 3 స్థానాల కోసం.. పది జట్ల మధ్య ఈ ఏడాది జూలై 3 నుంచి 19వ తేదీ వరకు శ్రీలంకలో క్వాలిఫయింగ్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇందులో పాకిస్థాన్ (19), వెస్టిండీస్ (13), శ్రీలంక (5), బంగ్లాదేశ్, ఐర్లాండ్తో పాటు ఐదు రీజినల్ క్వాలిఫయింగ్ విజేత జట్లు (థాయ్లాండ్, జింబాబ్వే, పపువా న్యూగినియా, అమెరికా, నెదర్లాండ్స్) పోటీ పడనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ అర్హత టోర్నీ వాయిదా తప్పకపోవచ్చు.
ఉద్రిక్త పరిస్థితులే కారణం:
'భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో సిరీస్ జరిగే వీలు లేకుండా పోయింది. ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత ప్రభుత్వ అనుమతి ఉంటేనే తాము పాల్గొంటామంటూ బీసీసీఐ పేర్కొంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జెఫ్ అలార్డైస్, క్రిస్ టెట్లీ, జొనాథాన్ హాల్తో కూడిన ఐసీసీ టెక్నికల్ కమిటీ సిరీస్ను రద్దు చేస్తూ ఇరు జట్లకు మూడేసి పాయింట్లు కేటాయించింది. భారత్, పాక్ సిరీస్తో పాటు కరోనా కారణంగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా, శ్రీలంక-న్యూజిలాండ్ల మధ్య సిరీస్లు రద్దు అయ్యాయి' అని ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.