హార్దిక్కు ప్రత్యామ్నాయంగా..
'హార్దిక్ పాండ్యాకు మించిన ఆటగాడిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అతనిలో అసాధారణమైన ప్రతిభ ఉంది. కానీ దురదృష్టవశాత్తు వెన్నుముక శస్త్రచికిత్స వల్ల బౌలింగ్ చేయలేకపోతున్నాడు. 2018లో అతను చివరిసారిగా ఇంగ్లండ్పై ఆడిన టెస్టు క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏదేమైనప్పటికీ అతనిపై ఒత్తిడి తగ్గించి తిరిగి కోలుకునేలా చేయాలి. అతనికి ప్రత్యామ్నయంగా ఆల్రౌండర్లను సెలక్టర్లు గుర్తించడం పెద్దపని. ఆ తర్వాత వారిని మేం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం.
శార్దూల్ సత్తా చాటడంతో..
శార్దూల్ విషయానికొస్తే అతడు మంచి ఆల్రౌండర్ అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్ ఆల్రౌండర్గా ఎదగాలని పట్టుదలతో ఉన్నట్లు అంతకుముందు చెప్పాడు. జట్టుకు కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎంతో అవసరం. కాబట్టి అతడిని ఆ విధంగా తీర్చుదిద్దుతాం. ఇంగ్లండ్ పర్యటనలో తన అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని భావిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల వర్క్లోడ్ తగ్గించడం చాలా ముఖ్యం.
రొటేషన్ విధానం ద్వారా
కఠిన బయోబబుల్స్ నేపథ్యంలో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తగ్గించి ఫ్రెష్గా ఉండేలా చేయాలి. భారత జట్టులో ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్లతో మొత్తం ఆరుగురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో ముగ్గురు లేదా నలుగురికే తుది జట్టులో అవకాశం దక్కుతుంది. కాబట్టి రొటేషన్ విధానం ద్వారా ఆడిస్తాం. దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వారిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.'అని భరత్ అరుణ్ వెల్లడించాడు. జూన్ 18-22 మధ్య ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.