హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానులపై జీఎస్టీ ప్రభావం పడింది. వినోదపు కార్యక్రమాలపై కేంద్రం 28 శాతం జీఎస్టీ పన్ను విధించడంతో క్రికెట్ మ్యాచ్ల టిక్కెట్ల ధరలు అమాంతం పెరిగాయి. సెప్టెంబర్-ఆక్టోబర్ మధ్య కాలంలో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 21న కోల్కతాలో వన్డే మ్యాచ్ జరుగనుంది. దీని కోసం శనివారం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ టిక్కెట్ల ధరలను నిర్ణయించింది. ఇక రూ.1300 టికెట్ ధర జీఎస్టీ ప్రభావంతో ఒక్కసారిగా రూ.1900 పెరిగింది. రూ.500 కనీస టిక్కెట్ ధరపై 28శాతం జీఎస్టీతో రూ.650 పెరిగిందని గంగూలీ తెలిపాడు.
అయితే మ్యాచ్ టికెట్ ధరలు ఏమి పెరగలేదని, కేవలం జీఎస్టీ మాత్రమే కలిపామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. మరోవైపు ఇదే కోల్కతాలో నవంబర్లో శ్రీలంకతో జరిగే టెస్టు మ్యాచ్ టికెట్లపై జీఎస్టీ ప్రభావం ఉండదని స్పష్టం చేశాడు. రూ.100గా ఉండే ఈ టికెట్ ధరపై జీఎస్టీ ప్రభావం లేదని తెలిపాడు.
సొంతగడ్డపై కోహ్లీసేనను ఢీకొట్టడం ఆస్ట్రేలియాకు పెద్ద సవాలేనని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ గాయం నుంచి కోలుకోకపోవడం ఆస్ట్రేలియాకు ఇబ్బందికరమైన విషయమని గంగూలీ అభిప్రాయపడ్డాడు.