హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పుడు గెలవాలనే తపనతో ఉందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు సౌతాంప్టన్ వేదికగా ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ మాట్లాడుతూ మూడో టెస్టులో భారత్ గెలిచిన తీరు చూస్తుంటే.. నాలుగో టెస్టులోనూ టీమిండియానే గెలిచేలా కనిపిస్తోందని ఇండియా టీవీలో పాల్గొన్న సెహ్వాగ్ 'క్రికెట్ కీ బాత్' షోలో అభిప్రాయపడ్డాడు.
"టీమిండియా మూడో టెస్టులో ఆడిన తీరు చూస్తుంటే.. నాలుగో టెస్టుని కేవలం నాలుగు రోజుల్లోనే గెలుపుగా ముగించేలా కనిపిస్తోంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ టెస్టులో పుంజుకోవచ్చు. భారత ఆటగాళ్లు మాత్రం ఇప్పుడు ఆకలితో ఉన్న పులుల్లా ఉన్నారు. వారు కచ్చితంగా గెలుపు కోసం వేటాడుతారు" అని సెహ్వాగ్ అన్నాడు.
"భారత బౌలింగ్ అటాక్ ప్రస్తుతం అత్యుత్తమంగా కనిపిస్తోంది. నలుగురు పేసర్లు మూడో టెస్టులో ఇంగ్లండ్ 19 వికెట్లు పడగొట్టడమే దానికి నిదర్శనం. నాలుగో టెస్టులో గెలిచి సిరీస్ని 2-2తో సమం చేయాలని భారత్ ఇప్పుడు తహతహలాడుతోంది" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
అంతేకాదు ఆతిథ్య ఇంగ్లాండ్పై ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-2తో గెలుస్తుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. చివరి రెండు టెస్టుల్లో టీమిండియానే తప్పక విజయం సాధిస్తుందని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లీషు గడ్డపై భారత్ తప్పక సిరిస్ గెలుస్తుందని సెహ్వాగ్ పేర్కొన్నాడు.