కామెంటేటర్పై దూషణ
ఐదవ టీ20లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుయింది. న్యూజిలాండ్లో ఉండే ఒక భారత అభిమాని మ్యాచ్ కామెంటేటర్ను దూషించాడు. 'Stuff.co.nz' నివేదిక ప్రకారం.. ఓ భారత అభిమాని గ్రౌండ్లో ఉన్న కామెంటేటర్ వద్దకు వెళ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ కామెంటేటర్ను కోరాడు. అందుకు ఆ కామెంటేటర్ నిరాకరించాడు. దాంతో కోపోద్రిక్తుడైన సదరు అభిమాని కామెంటేటర్పై దూషణకు దిగాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని స్టేడియం బయటకు పంపించేశారు.
భారత అభిమానిపై నిషేధం
కామెంటేటర్పై దూషణకు వెళ్లిన సదరు భారత అభిమానిపై న్యూజిలాండ్ క్రికెట్ పబ్లిక్ ఎఫైర్స్ మేనేజర్ రిచర్డ్ బూక్ చర్యలు తీసుకున్నారు. బే ఓవల్లో ఏ మ్యాచ్ జరిగినా 24 ఏళ్ల అభిమానిని అనుమతించం అని స్పష్టం చేసారు. కేవలం కామెంటేటర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంతోనే ఈ స్టేడియం ప్రవేశానికి అనుమతి లేకుండా చేస్తున్నామన్నారు. ఒకవేళ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసుంటే.. శిక్ష వేరుగా ఉండేదని బూక్ తెలిపారు. అయితే కామెంటేటర్ ఎవరు అనే విషయం తెలియరాలేదు.
ఆర్చర్పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు
గతేడాది ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్పై అసభ్యకర రీతిలో దూషించడంతో న్యూజిలాండ్కు చెందిన ఓ క్రికెట్ అభిమానిపై రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2019 నవంబర్లో న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఐదవ రోజు ఆటలో ఆర్చర్పై ఆక్లాండ్కు చెందిన ఒక అభిమాని వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. తొలుత అభిమానిని అరెస్ట్ చేసి.. ఆపై రెండేళ్ల పాటు క్రికెట్ మ్యాచ్లు చూడటానికి స్టేడియాలకు రాకుండా నిషేధం విధించారు.
టీమిండియా విజయం
ఐదవ టీ20లో మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. కుగ్లిన్ 2 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. రాస్ టేలర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్లు), టీమ్ సీఫెర్ట్ (30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ చెరో 2 వికెట్లు తీశారు.