1000వ టీ20 మ్యాచ్:
ఆదివారం భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగే టీ20 1000వ టీ20 మ్యాచ్. దీంతో భారత్, బంగ్లా జట్లు చరిత్రలో నిలవనున్నాయి. ఇరు జట్లు ఈ చారిత్రక మ్యాచ్లో విజయం సాధించాలని చూస్తున్నాయి. మరి 1000వ టీ20 మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. అయితే గెలిచిన జట్టు ఓ గొప్ప విజయంతో చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే బంగ్లాపై ఆడిన ఎనిమిది టీ20ల్లో గెలుపొందిన భారత్ ఇందులోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పాక్ రికార్డుపై భారత్ కన్ను:
ఇప్పటివరకు భారత్, బంగ్లా జట్లు ఎనిమిది టీ20ల్లో తలపడగా.. అన్ని సార్లు భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో బోణీ కొట్టాలని చూస్తోంది. టీ20ల్లో పాకిస్థాన్ 11-0 తేడాతో జింబాబ్వేపై అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో ఉంది. బంగ్లాపై భారత్ ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే.. పాక్ రికార్డును భారత్ సమం చేస్తుంది.
కాలుష్యం అడ్డంకి?:
ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. పొగ, దుమ్మూ, ధూళీ, మంచు ఢిల్లీని సతమతం చేస్తున్నాయి. ఇక దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. తొలి టీ20 మ్యాచ్కు కాలుష్యం అడ్డంకిగా మారినా.. బీసీసీఐ మాత్రం ఆటను కొనసాగిస్తోంది. శనివారం దిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ దుమ్మూ, ధూళీని తొలగించడానికి అరుణ్ జైట్లీ స్టేడియాన్ని నీటి ట్యాంకర్లతో కడిగారు. పెద్ద పైప్ ద్వారా స్టేడియంలోని గేట్ల పరిసరాల్ని శుభ్రంగా కడిగేశారు.
యువ ఆటగాళ్లకు అవకాశం:
ఆదివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ పార్రంభం కానుంది. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఆల్రౌండర్గా శివమ్ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్నాడు. రిషభ్ పంత్ను కూడా కొనసాగిస్తారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చింది.
కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా:
మరోవైపు కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా జట్టు పొట్టి ఫార్మాట్కు రెడీ అవుతోంది. ఐసీసీ బంగ్లా స్టార్ ఆల్రౌండర్ షకీబల్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ సిరీస్కు దూరం కావడంతో బంగ్లాదేశ్ జట్టు బలహీనపడింది. అయితే సీనియర్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మొసద్దిక్ హుస్సేన్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. తొలి టీ20లో బంగ్లా జట్టు ఎలా ఆడనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.