2009లో ఉగ్రదాడి:
2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ భయానక ఘటనతో అప్పటి నుంచి పాక్లో పర్యటించడానికి ఏ జట్టు సాహసం చేయలేదు. చాలా చర్చల తర్వాత శ్రీలంక జట్టే ఇటీవల పాకిస్థాన్లో పర్యటించి మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రెండు టెస్టుల సిరీస్ ఆడింది. కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ తేడాతో గెలిచి సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది.
భారతే చాలా ప్రమాదకరం:
సోమవారం రెండో టెస్టు పూర్తయిన తర్వాత పీసీబీ ఛైర్మన్ ఇషాన్ మని మీడియాతో మాట్లాడాడు. 'పాక్లో క్రికెట్ ఆడటం ప్రమాదకరం కాదని నిరూపించాం. ఒకవేళ ఏ జట్టైనా మా పర్యటనకు రాకపోతే.. ఇక్కడ భద్రతాపరమైన ప్రమాదం పొంచి ఉందని నిరూపించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్ కన్నా భారతే చాలా ప్రమాదకరంగా ఉంది. భారత్కు వెళ్లి క్రికెట్ ఆడటానికి లేని భయం పాక్ రావడానికి ఎందుకు?' అని ప్రశ్నించాడు.
ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు:
'శ్రీలంక జట్టు ఇక్కడ పర్యటించిన తర్వాత భద్రత విషయంపై ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు. శ్రీలంక టెస్టు సిరీస్తో పాక్లో క్రికెట్ పునర్వైభవం సంతరించుకుంటదనే నమ్మకం ఉంది. శ్రీలంక మాదిరి మిగతా దేశాలు కూడా పాక్లో క్రికెట్ ఆడటానికి రావాలి. సానుకూల వాతావరణం నెలకొందని ప్రపంచవ్యాప్తంగా చెప్పడానికి పాక్ మీడియా, అభిమానులు ఎంతో సహకరించారు' అని ఇషాన్ తెలిపాడు.
తటస్థ వేదికల్లో మ్యాచ్లు ఆడం:
'జనవరిలో బంగ్లాదేశ్ ఇక్కడ పర్యటించడానికి ఆ దేశ బోర్డుతో చర్చలు జరుపుతున్నాం. అలాగే ఇతర జట్లతో సైతం సంప్రదింపులు జరుపుతాం. ఇక నుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్లు ఆడం. ఎవరైనా మాతో సిరీస్ ఆడాలనుకుంటే ఇక్కడకు రావాల్సిందే. బంగ్లా తప్పకుండా పర్యటిస్తుందనే నమ్మకముంది. బంగ్లా బోర్డు తిరస్కరించడానికి ఇప్పుడు ఎలాంటి కారణాలు లేవు. శ్రీలంక పర్యటించాక మిగతా జట్లు ఎందుకు రావు' అని ఇషాన్ అన్నాడు.