
బ్యాటింగ్ ఆర్డర్ విఫలం..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 45.4 ఓవర్లలో 169 పరుగులు చేసింది. స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. 79 బంతుల్లో అయిదు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేసి అవుట్ అయింది. షఫాలి వర్మ, యష్తిక భాటియా, ఝులన్ గోస్వామి, రేణుక సింగ్, రాజేశ్వరి గయక్వాడ్ డకౌట్ అయ్యారు. కేప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్-4, హర్నీల్ డియోల్-4, దయాళన్ హేమలత-2 పరుగులు చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ దీప్తి శర్మ-68, పూజ వస్త్రకర్-22 పరుగులు చేయడంతో టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.

ఇంగ్లాండ్ కూడా..
170 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టు ఇన్నింగ్ కూడా తడబడుతూనే సాగింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా భారీ పరుగుల సాధించలేకపోయారు. టీమిండియా బౌలర్ల ధాటికి క్రీజ్లో కుదురుకోలేకపోయారు. టామీ బ్రీవ్మాంట్-8, ఎమ్మా లాంబ్-21, సోఫియా డంక్లే-7, ఎలైస్ క్యాప్సే-5, డ్యానీ వాట్-8, అమీ జోన్స్-28, సోఫీ ఎక్లెస్టోన్-0, ఫ్రేయ కెంప్-5, కేట్ క్రాస్-10, ఫ్రేయా డేవిస్-10 పరుగులు చేశారు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ ఛార్లీ డీన్ మాత్రమే 47 పరుగులు చేసింది.
అనూహ్యంగా రనౌట్..
చివరి ఆరు ఓవర్లల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో ఛార్లీ డీన్ అనూహ్యంగా అవుట్ అయింది. 44 ఓవర్లో మన్కడింగ్ ద్వారా అవుట్ అయిందామె. ఆ ఓవర్ను దీప్తి శర్మ సంధించింది. ఆ ఓవర్ మూడో బంతిని వేయడానికి దీప్తి శర్మ సిద్ధమైన తరుణంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న ఛార్లీ డీన్ క్రీజ్ను దాటి బయటికి వచ్చింది. దీనితో ఆ బంతిని సంధించకుండానే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న వికెట్ల బెయిల్స్ను గిరాటేసింది దీప్తి శర్మ. అంపైర్ దీన్ని రనౌట్గా పరిగణించాడు.
ఛార్లీ కన్నీటి పర్యంతం..
చివరి ఆరు ఓవర్లల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో చివరి వికెట్గా ఛార్లీ డీన్.. మన్కడింగ్ ద్వారా అవుట్ కావడం ఇంగ్లాండ్ జట్టును దిగ్భ్రాంతికి గురి చేసింది. డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లు షాక్కు గురయ్యారు. అప్పటికే ఆమె 80 బంతుల్లో అయిదు ఫోర్లతో 47 పరుగులు చేసింది. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనతో చార్లీ కన్నీటి పర్యంతం అయింది. పిచ్ మీద ఏడ్చేసింది. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న ఫ్రేయా డేవిస్ ఆమెను ఓదార్చడం కనిపించింది.


Click it and Unblock the Notifications












