అసలేం జరిగిందంటే..?
రొమారియో షెఫెర్డ్ వేసిన 39వ ఓవర్లో సంజూ శాంసన్ రనౌటయ్యాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా సంజూ ఆడగా.. నాన్ స్ట్రైకర్గా ఉన్న హుడా సింగిల్కు ప్రయత్నించాడు. సంజూ, హుడా మధ్య సమన్వయం కుదరకపోగా.. నేరుగా బంతిని అందుకున్న ఫీల్డర్ బౌలర్వైపు విసిరాడు. అయితే బంతిని బౌలర్ సరిగ్గా పట్టకపోయినా అతని మోకాలికి తగిలి వికెట్లను గీరాటేసింది. క్రీజుకు చాలా దూరంగా ఉన్న సంజూ నిరాశగా పెవిలియన్ చేరాడు. బౌలర్ వదిలినా.. బంతి అతని కాలికి తాకి వికెట్లకు తగలడం సంజూ దురదృష్టమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ రనౌట్ చాలా సిల్లీదని శిఖర్ ధావన్ పెర్కొన్నాడు. ఇలాంటి తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటారని మ్యాచ్ అనంతరం చెప్పాడు.

అక్షర్ పటేల్ చెలరేగడంతో..
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. కెరీర్లో 100వ వన్డే ఆడిన ఓపెనర్ షై హోప్(135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. దీపక్ హుడా, చాహల్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

రాణించిన మిడిలార్డర్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(13) విఫలమైనా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు. ఇక శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 63), సంజూ శాంసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దీపక్ హుడా సాయంతో అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. హుడా వెనుదిరిగినా.. సిరాజ్(1 నాటౌట్) సాయంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications












