నోబాల్స్తోనే ఒక ఓవర్..
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. 'ఏడు నోబాల్స్. ఒకసారి ఊహించుకోండి. అంటే ఒక ఓవర్ కంటే ఎక్కువ. అంటే ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 21 ఓవర్లు వేసినట్టు. క్రికెట్ లో ప్రతీ బౌలర్, బ్యాటర్కు చేదు అనుభవాలుంటాయి. బౌలర్లు చెత్త బంతులు వేస్తారు. బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటారు. కానీ ఇది రిథమ్ కు సంబంధించిన విషయం. గాయం తర్వాత తిరిగి జట్టుతో చేరినప్పుడు నేరుగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడకూడదు. అర్ష్దీప్ ముందు దేశవాళీ క్రికెట్ ఆడాలి. అక్కడ కొన్ని మ్యాచ్ లు ఆడి బౌలింగ్ లో మీ పాత రిథమ్ అందుకున్నాక అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలి. ఎందుకంటే టీ20 క్రికెట్ లో నోబాల్స్ అస్సలు ఆమోదయోగ్యం కాదు.
నేరుగా ఆడించడం ఎందుకు?
గాయం నుంచి కోలుకున్నాక దేశవాళీతో పాటు నెట్స్ లో ఎక్కువసేపు శ్రమించాలి. అక్కడ మెరుగ్గా ఉంటేనే మ్యాచ్ లో రాణించగలుగుతాం. అంతేగాక బౌలింగ్ కోచ్ కూడా ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలి. ప్రాక్టీస్ సెషన్స్లో కోచ్లు చాలా కఠినంగా ఉంటేనే మ్యాచ్ల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఏడు నోబాల్స్ అంటే దారుణం.. అదనంగా 30 పరుగులు. ఇది చాలా పెద్ద వ్యత్యాసం.'అని చెప్పుకొచ్చాడు.
నోబాల్స్ నియంత్రణలో ఉంటాయి..
గవాస్కర్ మాట్లాడుతూ.. 'ఒక ప్రొఫెషనల్ ఆటగాడు ఇలాంటివి చేయకూడదు. ఇక 'కొన్ని మన నియంత్రణలో ఉండవని..' ఈ కాలం ఆటగాళ్లు వీటిపై తరచూ చెప్పే సమాధానం మనం వింటుంటాం. అయితే.. నోబాల్ వేసిన తర్వాత ఏం జరుగుతుంది..? బ్యాట్స్మన్ ఏం చేస్తాడు..? అనేవి వేరే విషయాలు. నోబాల్స్ వేయకపోవడం అనేది కచ్చితంగా మీ నియంత్రణలోనే ఉంటుంది'అని గవాస్కర్ అన్నాడు. ఇక ఈ అంశంలో వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. అర్షదీప్కు మద్దతుగా నిలిచాడు. పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందనీ.. ఇది అంత సులభం కాదని పేర్కొన్నాడు.