భారీ మార్పులతో:
రెండో టీ20 మ్యాచుకు ముందు స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. అతనితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న 8 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఐసోలేషన్కి తరలించింది. పాండ్యాతో సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, మనీశ్ పాండేలు చివరి రెండు టీ20లకి దూరమయ్యారు. దాంతో భారత్ భారీ మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో.. దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీష్ రాణా టీ20 అరంగేట్రం చేశారు. బెంచ్ బౌలర్లు కూడా జట్టులోకి వచ్చారు.
ఆరుగురు బౌలర్లతో బరిలోకి:
స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా చివరి రెండు టీ20లకి ఐదుగురు బ్యాట్స్మన్, ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగింది. వన్డేలతో పోలిస్తే.. కొలంబోలోని ప్రేమదాస మైదాన పిచ్ నెమ్మదిగా మారింది. చివరి టీ20కి ఆరుగురు బౌలర్లు జట్టులో ఉన్నా టాస్ గెలిచిన భారత కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ఎంచుకున్నాడు. స్లో పిచ్పై బ్యాటింగ్ చేయడానికి బదులుగా ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకోవాల్సిందని పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అబిప్రాయపడ్డాడు. ముందుగా బౌలింగ్ చేసి లంకను తక్కువ పరుగులకే కట్టడి చేస్తే.. భారత్ విజయం సాధించేదన్నాడు.
ధావన్ది పూర్ కెప్టెన్సీ:
తాజాగా డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'భువనేశ్వర్ కుమార్ 6వ స్థానంలో బాగా బ్యాటింగ్ చేయగలడు. అలాంటప్పుడు మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకు ఎంచుకోలేదు. ప్రేమదాస పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ముందుగా బౌలింగ్ చేసి.. లంకను 100 పరుగుల లోపు పరిమితం చేయవచ్చు. ఆరుగురు బౌలర్లు జట్టులో ఉన్నారు కాబట్టి ముందుగా బౌలింగ్ చేసుంటే బాగుండేది. ఇది శిఖర్ ధావన్ పూర్ కెప్టెన్సీకి ఓ ఉదాహరణే అని చెప్పొచ్చు' అని పేర్కొన్నాడు. 2000లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది.
చెత్త షాట్లు ఆడారు:
'శ్రీలంక లెగ్ స్పిన్నర్ వానిందు హసరంగ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్పిన్ను బాగా ఆడగల భారత బ్యాట్స్మన్లు హసరంగ బౌలింగ్లో చాలా ఇబ్బందిపడ్డారు. చెత్త షాట్లు ఆడారు. తన అద్భుత బంతులతో హసరంగ భారత బ్యాటింగ్ను కుప్పకూల్చాడు. టీ20ల్లో నెం .2 బౌలర్ అని నిరూపించుకున్నాడు. అయితే భారత బ్యాట్స్మన్లు అతడికి వికెట్లను బహుమతిగా ఇచ్చారనుకుంటున్నా. హసరంగ బంతులను జాగ్రత్తగా ఆడి సింగిల్స్ తీస్తే బాగుండేది. భారత్ 130-140 స్కోరు చేసి ఉంటే బౌలర్లు పోరాడేవారే' అని పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు. మూడో టీ20లో భారత్ 81 పరుగులే చేసింది. కుల్దీప్ చేసిన 23 పరుగులే అత్యధికం.