గొంతునొప్పి వస్తుందన్నా.. కరోనా టెస్ట్ చేయని బీసీసీఐ వైద్యాధికారి! ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు!

ముంబై: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ను ధావన్ సేన గెలవగా.. టీ20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది. టీ20 సిరీస్ సమయంలో భారత జట్టులో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు మొదటగా కరోనా సోకగా.. అనంతరం మరికొంతమంది ఆటగాళ్లకు కూడా వైరస్ సోకింది. అయితే కృనాల్ కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్ నిజాలు ఆలస్యంగా బయట బయటపడ్డాయి. కృనాల్ గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే ఓ బీసీసీఐ వైద్యుడు ర్యాపిడ్ టెస్టు చేయలేదట. అంతేకాకుండా జట్టు సమావేశానికీ అతడికి అనుమతి ఇచ్చాడట.

మొదట పాండ్యాకు:
మూడు వన్డేల సిరీస్, తొలి టీ20 సజావుగా సాగాయి. మొదటి టీ20 తర్వాత కృనాల్ పాండ్యాకు కరోనా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. దాంతో రెండో టీ20ని ఒక రోజు వాయిదా వేశారు. అంతేకాకుండా కృనాల్తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిని ఐసోలేషన్కు పంపింది బీసీసీఐ. దీంతో స్టార్ ఆటగాళ్లు చివరి రెండు మ్యాచులకు దూరమయ్యారు. 11 మంది అందుబాటులో లేకపోవడంతో.. లంక పర్యటనకు నెట్ బౌలర్లుగా వెళ్లిన వారు జట్టులోకి వచ్చారు. దాంతో జట్టు బలహీనంగా మారడంతో భారత్ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. అయితే గొంతునొప్పి అని చెప్పిన వెంటనే వైద్యాధికారి స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.

ర్యాపిడ్ టెస్టు చేయలేదు:
నిజానికి జులై 26న కృనాల్ పాండ్యా తనకు గొంతు నొప్పి వస్తోందని బీసీసీఐ ప్రధాన వైద్యాధికారి అయిన అభిజిత్ సల్వీకి చెప్పాడట. నిబంధనల ప్రకారం అదే రోజు కృనాల్కి ర్యాపిడ్ టెస్టు చేయలేదు. పైగా జట్టు సమావేశంలో పాల్గొనేందుకు అతడికి అనుమతి ఇచ్చాడు. మరుసటి రోజైన 27న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేశాడు. దాంతో ఫలితాలు మధ్యాహ్నం వచ్చాయి. ఇక చేసేదిలేక మ్యాచును వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ, ఎస్ఎల్సీ ప్రకటించాయి. కృనాల్తో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మందికీ పరీక్షలు చేశారు. అప్పుడు అందరికి నెగెటివ్ అనే వచ్చింది. ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే.. శ్రీలంక నుంచి బయల్దేరే ముందు కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్కు పాజిటివ్ వచ్చిందట.

గొంతు నొప్పి ఉన్నప్పటికీ:
'జులై 26న కృనాల్ పాండ్యాకు గొంతునొప్పి వచ్చింది. నిబంధనల ప్రకారం అతడు వెంటనే బీసీసీఐ వైద్యాధికారిని కలిశాడు. అతడికి ర్యాపిడ్ టెస్టు చేయించి ఐసోలేషన్కు పంపించాల్సింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ర్యాపిడ్తో కచ్చితమైన ఫలితం వస్తుందని కాదు. కానీ బీసీసీఐ నిబంధనల్లో మొదట చేయాల్సింది మాత్రం అదే. గొంతు నొప్పి ఉన్నప్పటికీ.. కృనాల్ జట్టు సమావేశానికి హాజరయ్యాడని నేను చెప్పగలను. ఐపీఎల్లో ప్రతి మూడు రోజులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తుంటే శ్రీలంక సిరీసులో ఐదు రోజులకు చేసేందుకు బీసీసీఐ వైద్యబృందం ఎలా అంగీకరించిందో తెలియడం లేదు' అని శ్రీలంక పర్యటనతో సంబంధం ఉన్న ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది.

జే షా జోక్యం వలెనే:
'వాస్తవానికి సిరీస్ రద్దవ్వకుండా బీసీసీఐ కార్యదర్శి జే షా జోక్యం చేసుకున్నారు. కృనాల్ పాండ్యాతో కలిసిన వారిని ఐసోలేషన్కు పంపించారు. జే షా చర్యల వల్లే ఈ సిరీస్ సజావుగా కొనసాగింది. లేదంటే మధ్యలోనే ముగిసేది. శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఇప్పుడు మేలు జరిగింది. ఏదేమైనా బీసీసీఐ వైద్యబృందం చురుగ్గా స్పందించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది' అని ఆ బీసీసీఐ అధికారి తెలిపారు. కరోనా సోకడంతో కృనాల్, గౌతమ్, చహల్ మిగతా ఆటగాళ్లతో కలిసి స్వదేశానికి రాలేదు. ఆగస్టు ఆరంభంలో వారు ఇళ్లకు తమతమ చేరుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications