లక్ష్మణ్ సూపర్ క్యాచ్:
పుణె వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం రెండో టెస్ట్ ముగిసిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఆట ప్రారంభమవడానికి ముందు కామెంటేటర్లు అందరు మైదానంలో గల్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్చోప్రా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. షార్ట్ లెగ్లో లక్ష్మణ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. నిఖిల్ చోప్రా బంతిని వేయగా.. ఆకాశ్చోప్రా కొట్టిన బంతిని లక్ష్మణ్ డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే అది వన్బౌన్స్ క్యాచ్ కావడం విశేషం.
|
ఆశ్చర్యపోయిన ఆకాశ్చోప్రా:
లక్ష్మణ్ పట్టిన క్యాచ్కు సహచర కామెంటేటర్లు చప్పట్లు కొట్టి అభినందించారు. ఇక ఆకాశ్చోప్రా బ్యాట్ వదిలేసి ఆశ్చర్యపోయాడు. మ్యాచ్ అనంతరం ఈ వీడియోను లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'నేను పట్టిన అత్యద్భుత క్యాచ్లలో ఇదొకటి. ఫుల్ సూట్లో ఉన్న సమయంలో ఈ మ్యాచ్ జరిగింది. తెల్ల దుస్తుల్లో ఉన్నప్పుడు కాదు' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాంచీలో మూడో టెస్టు:
పుణెలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (254*; 336 బంతుల్లో 33×4, 2×6) డబుల్ సెంచరీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (91; 104 బంతుల్లో 8×4, 2×6) మెరుపు అర్ధ సెంచరీ చేశారు. అనంతరం ఉమేష్ యాదవ్, అశ్విన్, జడేజా చెలరేగడంతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరిస్ను భారత్ 2-0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టు రాంచీలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది.
గంగూలీకి కంగ్రాట్స్:
బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవబోతున్న గంగూలీకి కంగ్రాట్స్. మీ నేతృత్వంలో భారత క్రికెట్ మరింత వృద్ధి చెందుతుందని చెప్పడంలో సందేహం లేదు. కొత్త పాత్రలో మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు.