విశాఖ: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రొటీస్ స్పిన్నర్ సేనురాన్ ముత్తుసామి బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముత్తుసామి ఖాతాలో మొదటి టెస్ట్ వికెట్ చేరింది. భారత జట్టు 377 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. అంతకుముందు చతేశ్వర్ పుజారా (6) కూడా విఫలం కాగా.. ఓపెనర్ రోహిత్ శర్మ (176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు.
202/0 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్.. 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఉదయం మయాంక్ అగర్వాల్, రోహిత్ దూకుడుగా ఆడారు. ఈ ఇద్దరు రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్ పెవిలియన్ చేరాడు. ఓపెనర్గా ఇన్నింగ్స్ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రోహిత్ ఊపుచూస్తే డబుల్ సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంప్ ఔట్ అయ్యాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (153*, 304 బంతుల్లో; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రం సఫారీ బౌలర్లపై చెలరేగుతున్నాడు. ఇప్పటికే మయాంక్ 294 బంతుల్లో 150 పూర్తి చేసుకున్నాడు. అతడి కెరీర్లో ఇదే అత్యుత్తమ స్కోరు. ఈ మ్యాచ్లో మయాంక్ మరో రికార్డును అందుకున్నాడు. రోహిత్తో కలిసి తొలి వికెట్ 317 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాపై ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
బౌండరీలు బాదుతూ మయాంక్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కోహ్లీ అనంతరం క్రీజులోకి వైస్ కెప్టెన్ అజింక్య రహానే క్రీజులోకి వచ్చాడు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండో సెషన్ ముగిసిన తర్వాత భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ 112 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ (194), రహానే (7) పరుగులతో ఉన్నారు.