షమీ సీక్రెట్ బిర్యానీ:
రెండు ఇన్నింగ్స్ల్లో శతకాలు బాదిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ... 'ఇటీవల షమీ బాగా రాణిస్తున్నాడు. ప్రపంచకప్-2019లో కూడా వికెట్లతో చెలరేగాడు. చాలా నిలకడ ప్రదర్శిస్తున్నాడు. షమీ అదరగొట్టడం వెనుక ఓ సీక్రెట్ ఉంది. బిర్యానీ తిన్న తర్వాత ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. దాంతో అతడిలోని అత్యుత్తమ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. బిర్యానీ తినడమే షమీ అసలు సీక్రెట్' అని తెలిపాడు.
అంచనాల మేరకు ఆడటమే నా పని
'జట్టు అంచనాల మేరకు ఆడటమే నా పని. ఏదో ఓ రోజు ఓపెనింగ్ చేయాల్సి వస్తుందని రెండేళ్ల క్రితమే చెప్పారు. నెట్స్లోనూ నేను కొత్త బంతితోనే సాధన చేస్తా. అందుకే నా ఎంపిక ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎరుపు బంతి, తెలుపు బంతి అనేది కాకుండా.. ఆరంభంలో ఆచితూచి ఆడాలి. ఆఫ్ సైడ్ వెళ్లే బంతుల్ని వదిలేయాలి. దేహం మీదికి వచ్చేవాటిని ఎదుర్కోవాలి. బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితులను బట్టి అంతా ఆధారపడి ఉంటుంది. ఆచితూచి ఆడుతూనే దూకుడు ప్రదర్శించడం నా పని' అని రోహిత్ అన్నాడు.
రికార్డులపై మాత్రం అవగాహన లేదు
'రెండో ఇన్నింగ్స్లో ఆధిక్యం పెంచాలనుకున్నాం. అందుకే షాట్లు ఆడాలని భావించా. ప్రస్తుతం బౌలర్లు తెలివిగా బంతులు వేస్తున్నారు. పరుగులు రావొచ్చు లేదా ఔటైపోవచ్చు. నేను మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడా. ధైర్యం ఫలితాలను ఇస్తుందని నా నమ్మకం. ఈ టెస్టులో ఎన్నో చోటు చేసుకున్నాయి. రికార్డులపై మాత్రం అవగాహన లేదు. ఆటను ఆస్వాదిస్తూ జట్టును పటిష్ఠ స్థితిలో పెట్టడంపైనే దృష్టి పెట్టా. జట్టును గెలిపించాలని కోరుకున్నా' అని రోహిత్ పేర్కొన్నాడు.
బౌన్స్ తక్కువగా ఉంటే బ్యాట్స్మెన్కు కష్టం
'పిచ్ మందకొడిగా ఉండి బౌన్స్ తక్కువగా ఉంటే బ్యాట్స్మెన్కు చాలా కష్టం. జట్టులో వికెట్లు తీసే మంచి బౌలర్లు ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో వైవిధ్యమైన బౌన్స్, రివర్స్ స్వింగ్ మేలు చేసింది. కట్టుదిట్టంగా బంతులు వేసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను అసౌకర్యానికి గురిచేశాం. వికెట్లను త్వరగా పడగొట్టడం కలిసొచ్చింది. ఈ విజయం అందరిది. వచ్చే టెస్టులలో కూడా రాణించడానికి ప్రయత్నిస్తా' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.