
ముంబై: దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాట్స్మన్ అవసరం ఉంది. జాంటీ రోడ్స్ మళ్లీ బ్యాట్ పట్టుకుని రాంచీ టెస్టులో ఆడొచ్చు కదా!! అని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కోరాడు. అదేంటి జోంటి రోడ్స్ ఎప్పుడో రిటైర్ అయ్యాడు కదా.. మళ్లీ క్రికెట్ ఆడమని కోరడం ఏంటి అనుకుంటున్నారా. విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికా జెర్సీ ధరించి జాంటీ రోడ్స్ తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఖాతాలో పోస్ట్ చేశాడు.
'గ్రీన్ అండ్ గోల్డ్ జెర్సీని వేసుకోవడం గొప్ప అనుభూతి. ఇది కేవలం ఫొటోషూట్ కోసం మాత్రమే. స్టంట్స్ చేయడానికి ఈ రోజు నా బాడీ సహకరించింది. 50 సంవత్సరాల వయసులో కూడా స్టంట్స్ చేస్తున్నా. ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ఇలా ఫోజిచ్చా' అని జోంటి రోడ్స్ పోస్ట్కు క్యాప్టన్ జత చేశాడు. ఈ పోస్ట్కు హర్భజన్ స్పందించాడు. 'జాంటీ.. మీ దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాట్స్మన్ అవసరం ఉంది. నువ్వు మళ్లీ మైదానంలోకి దిగొచ్చుకదా. భారత్తో రాంచీలో జరుగనున్న చివరి టెస్టులో ఆడవా' అని హర్భజన్ సరదాగా ట్వీట్ చేసాడు.
మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. వరుస రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్ను ఇంకా ఒక టెస్టు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. విశాఖపట్టణం, పుణేల్లో జరిగిన టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయాల్ని సాధించింది. పుణే టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేసి మంచి ఫామ్లో ఉన్నారు. భారత్ ఊపు చూస్తే.. చివరి టెస్ట్ కూడా సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది.
టెస్టు చాంపియన్షిప్ పాయింట్లలో రెండొందల పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. చివరి టెస్టును భారత్ గెలిస్తే 240 పాయింట్లు సాధిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు చాంపియన్షిప్ ఆరంభించిన తర్వాత భారత్.. వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ సాధించింది. దాంతో 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఇది మూడు టెస్టుల సిరీస్ కావడంతో రెండు టెస్టుల్లో విజయాల ద్వారా 80 పాయింట్లను సాధించింది.