8 పరుగులే ఇవ్వడం..
ఈ మ్యాచ్లో మొత్తం నాలుగు ఓవర్లు వేసిన దీపక్ చాహర్ ఒక్క వికెట్ తీయకపోయినా 24 పరుగులే ఇచ్చాడు. చాహర్ కట్టడైన బౌలింగే భారత్ను ఓటమి నుంచి రక్షించింది. ముఖ్యంగా 17వ ఓవర్లో అతను పొదుపుగా బౌలింగ్ చేయడం రోహిత్ సేనకు కలిసొచ్చింది. ఔట్సైడ్ ఆఫ్, స్లోయర్ బౌన్సర్, వైడ్ యార్కర్లతో డేంజరస్ డికాక్, మిల్లర్లను దీపక్ చాహర్ కట్టడి చేశాడు. ఆఖరి బంతికి బౌండరీ ఇచ్చినా అప్పటికే చేయాల్సిన నష్టం చేశాడు. ఈ ఓవర్కు ముందు సౌతాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 82 పరుగులు కావాలి.
ఆఖరి ఓవర్లు చూస్తేనే..
ఓవర్కు 20.5 పరుగుల చొప్పున చేయాలి. కానీ దీపక్ చాహర్ 8 పరుగులే ఇవ్వడంతో సఫారీ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. ఇతర బౌలర్లలా అతను కూడా 20 పై చిలుకు పరుగులిస్తే సఫారీ టీమ్ విజయం సాధించేది. హర్షల్ పటేల్ సైతం 18వ ఓవర్లో 11 పరుగులివ్వడం కలిసొచ్చింది. అర్ష్దీప్ సింగ్ 19వ ఓవర్లో 26 పరుగులివ్వగా.. ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ 20 ఇచ్చాడు. ఈ రెండు ఓవర్లు చూసిన తర్వాత దీపక్ చాహర్ వేసిన ఓవర్ ఎంత విలువైనదో తెలిసొచ్చింది.
టాస్ ఓడిపోవడం..
ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం కూడా టీమిండియాకు కలిసొచ్చింది. ఈ మైదాన గత చరిత్ర చూసుకున్నా.. పిచ్ చూసినా భారీ స్కోర్లు చేయడం కష్టమని అంతా అనుకున్నారు. పిచ్ రిపోర్ట్లో కూడా ఇదే విషయం చెప్పారు. బంతి పిచ్కు అతుక్కుంటుందని, ఆగుతూ వస్తుందని తెలిపారు. దాంతో టాస్ గెలిచిన బవుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ సైతం టాస్ గెలిస్తే ఇదే చేసేవాడినన్నాడు. కానీ ఆరంభంలో కాస్త బౌలర్లకు అనుకూలించిన పిచ్ ఆ తర్వాత బ్యాటింగ్కు స్వర్గధామంగా మారింది. దాంతో ఇరు జట్ల బ్యాటర్లు రెచ్చిపోయారు. భారత్ తరఫున బరిలోకి దిగిన అందరూ దంచికొట్టారు. 20 పరుగులు అదనంగా చేయడం భారత్కు కలిసొచ్చింది.
బవుమా ఘోర తప్పిదం..
పేస్కు అనుకూలించే తొలి మ్యాచ్లో ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్న సఫారీ కెప్టెన్ బవుమా.. రెండో మ్యాచ్లో ఎక్స్ట్రా పేసర్తో ఆడి ఓటమి కొని తెచ్చుకున్నాడు. బ్యాటింగ్కు అనుకూలంగా మారిన గౌహతి పిచ్పై పేసర్లు దారుణంగా విఫలమయ్యారు. స్పిన్నర్లు కాస్త కూస్తో ప్రభావం చూపారు.
సౌతాఫ్రికాలో కేశవ్ మహరాజ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. ఇతర బౌలర్లు విఫలమయ్యారు. మరో స్పిన్నర్ ఉండి ఉంటే.. టీమిండియా భారీ స్కోర్ చేసేది కాదు. మిడిల్ ఓవర్లలో కాస్త పరుగుల వేగం తగ్గేది. అప్పుడు సఫారీ బ్యాటర్లు చేజింగ్ అనుకూలమయ్యేది. పరిస్థితులను అంచనా వేయడంలో సఫారీ టీమ్ విఫలమవుతోంది. ఈ కారణంతోనే రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ చేజార్చుకుంది.