జోహన్నెస్బర్గ్: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆట ఎట్టకేలకు మొదలైంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోగా.. చివరి సెషన్ ఆట మొదలైంది. ఈ రోజు 34 ఓవర్ల ఆట జరిగే అవకాశముంది. వీలైతే మరో అరగంట పాటు ఆటను పొడిగించనున్నారు.
118/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ డీన్ ఎల్గర్(57 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డసెన్(39 బ్యాటింగ్) అతనికి సహకరిస్తున్నాడు. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో భారత బౌలర్లకు బంతిపై పట్టు చిక్కడం లేదు. 51 ఓవర్లు పూర్తి చేసుకునేసరికి సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక సౌతాఫ్రికా విజయానికి 68 రన్స్ అవసరం కాగా.. భారత్ గెలుపునకు 8 వికెట్లు కావాలి. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్లో భారత్ గెలవడం కష్టమే.
ఈ మ్యాచ్లో భారత్ జట్టు సౌతాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. అజింక్యా రహానే (78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58), చతేశ్వర్ పుజారా (86 బంతుల్లో10 ఫోర్లతో 53) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 50, రవిచంద్రన్ అశ్విన్ 46, మార్కో జాన్సెన్ 4/31)
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్( కీగన్ పీటర్సన్ 62, శార్దూల్ ఠాకూర్ 7/61)
భారత్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్( రహానే 58, పుజారా 53, లుంగి ఎంగిడి 3/43)