ధోని సలహా తీసుకుని డీఅర్ఎస్లో కోహ్లీ సక్సెస్
డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అనేంతగా ధోని పాపులర్ అయ్యాడు. దీంతో వన్డే, టీ20ల్లో ధోని సలహా తీసుకోనిదే.. కోహ్లీ సైతం డీఆర్ఎస్ అడిగే సాహసం చేయడు. శనివారం జరిగిన నాలుగో వన్డేలో కూడా ధోని సలహా తీసుకుని డీఅర్ఎస్లో కోహ్లీ సక్సెస్ అయ్యాడు. కానీ ఐదో వన్డేలో మాత్రం ధోని డీఆర్ఎస్ అంచనా తప్పింది. భారత మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు గాను సఫారీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ తరచూ క్రీజు వెలుపలికి వచ్చి బంతిని హిట్ చేస్తున్నాడు.
మిల్లర్ ఫ్యాడ్స్ని తాకిన బంతి
ఈ క్రమంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన చాహల్ ఎక్కువగా బంతిని ఆఫ్ స్టంప్కి వెలుపల విసురుతూ వచ్చాడు. ఇందులో భాగంగానే ఆ ఓవర్లోని నాలుగో బంతిని లోపలికి టర్న్ చేయగా.. మిల్లర్ హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి అతని బ్యాట్కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్ని తాకింది. దీంతో ఫీల్డర్లు ఔట్ కోసం అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ దానిని అప్పీల్ని తిరస్కరించాడు. దీంతో ఎల్బీఏమో అని అనుమానం వ్యక్తం చేసిన చాహల్.. డీఆర్ఎస్ అడగాల్సిందిగా కెప్టెన్ కోహ్లీని కోరాడు.
ధోని సూచన అడిగి డీఆర్ఎస్ కోరిన కోహ్లీ
దీంతో కోహ్లీ... ధోని సూచన అడిగి అనంతరం డీఆర్ఎస్ కోరాడు. అయితే, రిప్లైలో బంతి టర్న్ తీసుకుని లెగ్స్టంప్కి అవతలకి వెళ్తున్నట్లుగా కనిపించింది. దీంతో అంపైర్ నాటౌట్ అంటూ తన మునుపటి నిర్ణయానికే కట్టుబడగా భారత్ తనకున్న ఏకైక రివ్య్వూ ఆప్షన్ని కోల్పోయింది. రివ్యూలో బంతి లెగ్స్టంప్కి అవల వెళ్తుండటాన్ని చూసిన విరాట్ కోహ్లి కోపంతో ఊగిపోయాడు.
ఆమ్లా ఎల్బీగా ఔటైనా అంపైర్ నాటౌట్ అంటూ
ఆ తర్వాత కొద్దిసేపటికే చాహల్ బౌలింగ్లో ఆమ్లా ఎల్బీగా ఔటైనప్పటికీ అంపైర్ నాటౌట్ అంటూ ప్రకటించాడు. భారత వద్ద డీఆర్ఎస్లు లేకపోవడంతో అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఆమ్లా దూకుడుగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. ఒకానొక దశలో దక్షిణాఫ్రికాకు విజయం అందించేలా కనిపించాడు. అయితే, తన అద్భుతమైన ఫీల్డింగ్తో పాండ్యా డైరెక్ట్ త్రో విసిరి ఆమ్లా(71)ను రనౌట్ చేశాడు.
ఆమ్లాను రనౌట్ చేసిన పాండ్యా
దీంతో ఐదో వన్డేలో భారత్ విజయం మరింత సులువైంది. భువనేశ్వర్ వేసిన 35 ఓవర్ రెండో బంతికి ఆమ్లా మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న పాండ్యా బంతి వికెట్లకు తాకి బెయిల్స్ ఎగిరి లైట్లు వెలిగిన మిల్లీ సెకన్ల వ్యవధిలోనే ఆమ్లా బ్యాట్ను క్రీజులో ఉంచాడు. అదృష్టం ఈసారి భారత్ను వరించడంతో.. బెయిల్స్ గాల్లోకి లేచే సమయానికి బ్యాట్ అంచు మాత్రమే క్రీజు గీతపై ఉంది. అన్ని కోణాల్లో పరిశీలించిన అంపైర్ ఆమ్లాను ఔట్గా ప్రకటించాడు. దీంతో ఆమ్లా పెవిలియన్ చేరాడు. భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. అంతకు ముందు రహానే క్యాచ్ జారవిడచడం, అంపైర్ తప్పిదం కారణంగా రెండుసార్లు జీవదానం పొందాడు.