విశాఖ: విశాఖ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరణుడు అడ్డుపడ్డాడు. టీ విరామం అనంతరం వర్షం పడడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. స్టేడియం పరిసరాల్లో ఆకాశం ఒక్కసారిగా మబ్బులు పట్టి.. వర్షం కురిసింది. ఒకవైపు మైదానం చిత్తడిగా మారడం, వెలుతురులేమి కారణంగా మ్యాచ్ సాగేందుకు వీలుకాలేదు. దీంతో మ్యాచ్ను అంపర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం కూడా పరిస్థితి అలాగే ఉండడంతో అంపర్లు తొలి రోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు.
IND vs SA: తొలి టెస్ట్లో భారీ 'సెంచరీ' భాగస్వామ్యం.. ఓపెనర్ల అరుదైన రికార్డులు
ఆట నిలిచిపోయే సమయానికి 59.1 ఓవర్లలో టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 202 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (115; 174 బంతుల్లో, 12x4, 5x6) సెంచరీ చేయగా.. మయాంక్ అగర్వాల్ (84; 183 బంతుల్లో, 11x4, 2x6) సెంచరీకి చేరువగా ఉన్నాడు. తొలి రోజులో ఇంకా 30 ఓవర్ల ఆట మిగిలి ఉండగా.. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్లు భారీ స్కోర్పై కన్నేశారు. రోహిత్, మయాంక్ ఉదయం నెమ్మదిగా ఆడినా.. లంచ్ విరామం తర్వాత ధాటిగా ఆడుతూ పరుగులు సాధించారు. ముఖ్యంగా రోహిత్ స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలు, సిక్సులు బాదాడు.
154 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ చేసాడు. టెస్టుల్లో ఓపెనర్గా ఆడుతున్న తొలి మ్యాచ్లోనే రోహిత్ సెంచరీ చేయడం విశేషం. ఓపెనర్ల ఆటతో విశాఖ స్టేడియం హోరెత్తింది. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్లు కొడుతుండడంతో అభిమానుల కేరింతలతో స్టేడియం మొత్తం సందడిగా మారింది. ఈ జోడీని విడదీయడానికి ప్రొటీస్ బౌలర్లు అష్ట కష్టాలు పడ్డారు. స్టార్ పేసర్ రబాడా కూడా చేతులెత్తేశాడు. మరోవైపు స్పిన్నర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్లు ఇలాగే చెలరేగితే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించడం ఖాయం.
రోహిత్, అగర్వాల్ మొదటి వికెట్కు ఇప్పటికే 202 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు భారత్ తరఫున కొన్ని రికార్డులను బద్దలు కొట్టారు. సెంచూరియన్లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్, గంభీర్ 2010లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సఫారీలపై భారత్కు ఇదే తొలి 100పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం. తొలి ఇన్నింగ్స్లో 100పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం అందించిన భారత ఏడో జోడీగా మయాంక్, రోహిత్ నిలిచారు.