ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటములకు భారత జట్టు రెండింతల ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. తాజాగా రెండు టెస్ట్ల సిరీస్ను కూడా1-0తో గెలుచుకుంది. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన 372 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రవిచంద్రన్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది. ఇక మ్యాచ్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
ఈ ఇన్స్టా స్టోరీలో అశ్విన్ షేర్ చేసిన ఫొటోలో అక్షర్ పటేల్, ఆజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజాలు.. భారత ఆటగాళ్ల పేర్లను రీ క్రియేషన్ చేసాడు. వెనక్కు తిరిగి.. జెర్సీపై ఉన్న తమ ఫస్ట్ నేమ్స్ కనబడలేలా ఫోజిచ్చారు. దాంతో ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 60), హెన్రీ నికోల్స్(111 బంతుల్లో 8 ఫోర్లు 44), విల్ యంగ్ (41 బంతుల్లో 4 ఫోర్లతో 20), రచిన్ రవీంద్ర(50 బంతుల్లో 4 ఫోర్లతో 18) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా.. కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఈ విజయానంతరం మాట్లాడిన అశ్విన్.. 10వ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇది నా 10వ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనుకుంటా. వాంఖడే మైదానంలోని పరిస్థితులను పూర్తి ఆస్వాదించా. ప్రతీ రోజు కొత్తగా అనిపించింది. సరికొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఆజాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. వాంఖడేలో ప్రతీ సారి బంతిని స్పిన్ చేయడం కుదరదు. కానీ అతను బంతి సీమ్ను వాడుకుంటూ సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేసి 10 వికెట్లు పడగొట్టాడు.
జయంత్ నేను కలిసి సాధన చేశాం. 2014లో నా సలహాల కోసం అతను హర్యానా నుంచి చెన్నైకి వచ్చాడు. మా మధ్య మంచి రిలేషన్ ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఆడినప్పటి నుంచి అక్షర్తో కలిసి ఆడుతున్నాను. సౌతాఫ్రికా పర్యటనలో కూడా ఇదే ప్రదర్శన కనబర్చి సిరీస్ కైవసం చేసుకుంటాం. గతంలో అందని ఈ విజయాన్ని ఈ సారి అందుకుంటాం'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.