|
అసలేం జరిగిందంటే..
భారత ఇన్నింగ్స్లో థర్డ్ అంపైర్ తప్పిదానికి హార్దిక్ పాండ్యా బలయ్యాడు. డేరిల్ మిచెల్ వేసిన 40వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతి హార్దిక్ పాండ్యా బ్యాట్ను తాకకుండా కీపర్ టామ్ లాథమ్ చేతిలో పడింది. అయితే బెయిల్స్ కిందపడటంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. పలు కోణాల్లో పరిశీలించి ఔటిచ్చాడు. బంతిని అందుకునే క్రమంలో టామ్ లాథమ్ గ్లోవ్స్ తాకి బెయిల్ కిందపడినట్లు రిప్లేలో కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ ఔటివ్వడం అందర్నీ విస్మయపరిచింది.
|
ప్రాంక్ చేసిన ఇషాన్ కిషన్
ఇది మనసులో పెట్టుకున్న ఇషాన్ కిషన్.. టామ్ లాథమ్ తరహాలోనే కీపింగ్ గ్లోవ్స్తో బెయిల్స్ను పడేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. కానీ రీప్లేలో ఇషాన్ గ్లోవ్స్ తాకినట్లు తేలడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెన్రీ నికోల్స్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్.. ఎదుర్కొన్న తొలి బంతికే భారత ఆటగాళ్లు అప్పీల్ చేసారు. కుల్దీప్ వేసిన బంతిని టామ్ లాథమ్ బ్యాక్ఫుట్లో డిఫెన్స్ చేయగా.. ఇషాన్ కిషన్ బెయిల్స్ పడేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. దాంతో టామ్ లాథమ్ సైతం హిట్ వికెట్ అయ్యానా? అని గందరగోళానికి గురయ్యాడు. కానీ ఇషాన్ పనేనని తెలియడంతో భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు.
ఈ పిల్ల చేష్టలు ఏంటి...?
ఇషాన్ కిషన్ చేసిన పనిని భారత కామెంటేటర్లు తప్పుబట్టారు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఈ పిల్ల చేష్టలు ఏంటని మండిపడ్డారు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ ఇషాన్ కిషన్ తీరును తప్పుబట్టాడు. అభిమానులు మాత్రం ఇషాన్ కిషన్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ రోజుల్లో ఇలానే వ్యవహరించాలని, మోసానికి మోసం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఇషాన్ తన చర్యతో టామ్ లాథమ్ మోసాన్ని గుర్తు చేశాడని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇషాన్ డబుల్.. సిరాజ్ మెరుపుల్!
ఈ మ్యాచ్లో భారత్ 12 పరుగులతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్లతో 208) ఒక్కడే డబుల్ సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ(34), సూర్యకుమార్ యాదవ్(31) రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 337 పరుగులకు కుప్పకూలింది. మైకేల్ బ్రేస్వెల్(78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్లతో 140) విధ్వంసకర సెంచరీతో ఓడించినంత పనిచేశాడు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షమీ, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.