పృథ్వీషా హాఫ్ సెంచరీ..
పచ్చిక పిచ్లపై టాస్ చాలా కీలకం. కానీ భారత్ వరుసగా రెండో సారి టాస్ ఓడి మూల్యం చెల్లించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఆతిథ్య బౌలర్లు బ్యాట్స్మన్ను ముప్పు తిప్పలు పెట్టి ఫలితాన్ని రాబట్టారు.
ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ( 11 బంతుల్లో ఫోర్ 7)ను బౌల్ట్ వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో భారత్ 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన పుజారా (54)తో కలిసి పృథ్వీ షా (54) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఫోర్లు, సిక్సర్లతో వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 47 పరుగులు వద్ద ఉన్నప్పుడు వాగ్నెర్ బౌలింగ్లో ఫైన్లెగ్ మీదుగా సిక్సర్ బాది 60 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. కానీ అదే జోరులో జేమీసన్ బౌలింగ్లో షాట్కు యత్నించి స్లిప్లో ఉన్న లేథమ్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 85/2తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
హాఫ్ సెంచరీ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసిన పృథ్వీ షా.. ఏంటా రికార్డ్..?
కోహ్లీ విఫలం..
లంచ్ విరామం అనంతరం టీమ్ సౌథీ బౌలింగ్లో విరాట్ కోహ్లీ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. అతను రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. కోహ్లీ మరోసారి విఫలమవ్వడం టీమిండియాను కలవరపెడుతోంది. గత ఐదు ఇన్నింగ్స్ల్లో విరాట్ 3, 19, 2, 9, 15 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రహానే(7) కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. సౌథీ బౌలింగ్లో టేలర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
ఆదుకున్న విహారీ.. పుజారా
కష్టాల్లో ఉన్న భారత్ను విహారీ, పుజారా 81 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించారు. ఓపికగా ఆడుతూ.. వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో పుజారా 117 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో కెరీర్లో 25 హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా.. విహారీ వన్డే తరహాలో ధాటిగా ఆడాడు. 67 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే ఇదే జోరును కొనసాగించలేకపోయిన విహారీ.. వాగ్నర్ బౌలింగ్లో వాట్లింగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 194/5తో టీ బ్రేక్కు వెళ్లింది.
22 పరుగుల వ్యవధిలోనే
టీ విరామం అనంతరం యువ పేసర్ జెమీసన్ చెలరేగాడు. షార్ట్ పిచ్ బంతులతో భారత బ్యాట్స్మన్ను బెంబేలెత్తించాడు. పుజారాను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చిన జెమీసన్.. తర్వాత పంత్(12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే ఉమేశ్ యాదవ్(0), జడేజా(9) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అతని దెబ్బకు భారత్ 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. చివర్లో షమీ(16), బుమ్రా(10) ధాటిగా ఆడటంతో భారత్ 242 పరుగులు చేయగలిగింది.