|
హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా
రెండో టెస్టు మ్యాచ్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన పృథ్వీ షా మంచి ఊపుమీద ఉన్నట్లు కనిపించాడు. అయితే లంచ్ బ్రేక్ కంటే ముందు కైల్ జేమిసన్ వేసిన వైడ్ బాల్ను ఆడబోయి వికెట్ల వెనకాల ఉన్న కీపర్ టామ్ లాథమ్కు చిక్కాడు. దీంతో పృథ్వీ షా పెవీలియన్కు చేరాడు. అర్థసెంచరీ చేసిన పృథ్వీషాను కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందించాడు. అయితే పృథ్వీ షా ఈ ఇన్నింగ్స్లో ఓ రికార్డు క్రియేట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత న్యూజిలాండ్లో జరిగిన టెస్టు మ్యాచ్లో అర్థశతకం పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ
అత్యంత పిన్న వయస్సులో న్యూజిలాండ్లో టెస్టు హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1990లో సచిన్ టెండూల్కర్ : 16 ఏళ్లు 291 రోజులు
2020లో పృథ్వీ షా : 20 ఏళ్లు 112 రోజులు
1990లో అతుల్ వాసన్ : 21 ఏళ్లు 336 రోజులు
1976లో బ్రిజేష్ పటేల్ : 23 ఏళ్లు 81 రోజులు
1981లో సందీప్ పాటిల్ : 24 ఏళ్లు 187 రోజులు
పృథ్వీ షా ఆటతీరు ఆకట్టుకుందన్న లక్ష్మణ్
ఇదిలా ఉంటే పృథ్వీ షా సాధించిన ఘనతపై టీమిండియా మాజీ స్టార్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. పృథ్వీ షా ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు లక్ష్మణ్. వెల్లింగ్టన్లో విఫలమైన తర్వాత తిరిగి క్రైస్ట్ చర్చ్లో ఆత్మవిశ్వాసంతో ఆడిన బ్యాటింగ్ తనను ఇంప్రెస్ చేసిందని లక్ష్మణ్ చెప్పారు. మిడ్ ఆఫ్ ప్రాంతంలో తాను బంతిని ఆడిన తీరు అద్భుతమని వర్ణించారు మాజీ హైదరాబాదీ క్రికెటర్. ఇక పృథ్వీ షాలో ఎంతో టాలెంట్ దాగి ఉందని చెప్పేందుకు ఈ ఇన్నింగ్స్ నిదర్శనమన్నారు లక్ష్మణ్.అయితే తాను చేసిన తప్పును సరిదిద్దుకుని మళ్లీ మంచి బ్యాటింగ్తో పృథ్వీ షా అలరిస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు లక్ష్మణ్.
విమర్శకులకు బ్యాట్తో పృథ్వీ షా సమాధానం
వెల్లింగ్టన్లో పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన తర్వాత రెండో టెస్టులో స్థానం దక్కుతుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే విమర్శకుల నోర్లు మూయిస్తూ తన బ్యాట్తో రెండో టెస్టులో పృథ్వీ షా సమాధానం చెప్పాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి ఫుట్ వర్క్తో అనవసరమైన బాల్స్ జోలికి వెళ్లకుండా చాలా చక్కగా ఆడాడు. ఢిఫెన్స్ ఆడే సమయంలో ఆటతీరు ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పృథ్వీ షా వమ్ము చేయకుండా తనవంతు అర్థ సెంచరీతో జట్టుకు మంచి స్టార్ట్ ఇచ్చాడు.
విధ్వంసకుడిగా మారే అవకాశం: కోహ్లీ
పృథ్వీ షా ఒక్కసారి సెట్ అయ్యాడంటే అతను చాలా విధ్వంసకరంగా మారే ప్రమాదం ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టు ఆరంభానికి ముందు చెప్పాడు. ఒక్కసారి తాను చేయగలనని స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే ఆ ఆటతీరు మరోలా ఉంటుందని ప్రశంసలు కురిపించాడు కోహ్లీ. ఇప్పటికే ఓపెనింగ్ స్థానం కోసం శుభ్భన్ గిల్ పోటీలో ఉండగా.. షాకు ఇచ్చిన మరో అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడనే అభిప్రాయం క్రికెట్ ఫ్రాటర్నిటీలో వ్యక్తమవుతోంది.