తొలి టెస్ట్ రేపే..
న్యూజిలాండ్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ గురువారం మొదలు కానుంది. తొలి టెస్ట్కు ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక కానుంది. అయిదు సంవత్సరాల తరువాత తొలి టెస్ట్ మ్యాచ్ ఇక్కడ షెడ్యూల్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. టీమిండియాకు బాగా అచ్చి వచ్చిన స్టేడియం ఇది. విజయాల ట్రాక్ రికార్డు అధికం. మొత్తం 22 టెస్ట్ మ్యాచ్లు ఇక్కడ జరగ్గా- ఏడింట్లో భారత్ విజయం సాధించింది. మూడింట్లో మాత్రమే ఓడింది. మిగిలిన 12 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
2016లో కివీస్తోనే చివరి మ్యాచ్
కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత జట్టు చివరిసారిగా 2016లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇదే న్యూజిలాండ్ జట్టును ఢీ కొట్టింది. విజయాన్ని అందుకుంది. 216 పరుగుల భారీ తేడాతో బ్లాక్ క్యాప్స్ను ఓడించింది. కివీస్ టీమ్కు ఏ మాత్రం అచ్చిరాని పిచ్ ఇది. ఈ స్టేడియంలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అంతకుముందు 1983లో చివరిసారిగా టీమిండియా.. వెస్టిండీస్ను ఢీ కొట్టింది. ఆ మ్యాచ్లో ఓడిపోయింది. 1952లో భారత్-ఇంగ్లాండ్ మధ్య మొట్టమొదటి సారిగా ఈ పిచ్పై టెస్ట్ మ్యాచ్ను నిర్వహించారు. ఆ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది.
పిచ్ రిపోర్ట్..
సాధారణంగా కాన్పూర్ స్టేడియం పిచ్.. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. తొలి రెండు రోజుల్లో బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది, ఆ తరువాత స్పిన్ వైపునకు పిచ్ మొగ్గు చూపొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడానికే అవకాశం ఉంది. చలికాలం కావడం వల్ల తొలి గంట పిచ్ తేమగా ఉంటుందని, బౌలర్లకు అనుకూలంగా మారుతుందని క్యురేటర్ అభిప్రాయపడుతున్నారు.
న్యూజిలాండ్.. నంబర్ వన్..
ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగుల్లో న్యూజిలాండ్ జట్టు నంబర్ వన్ హోదాలో కొనసాగుతోంది. న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. దీని రిజల్ట్ ఏమిటనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంగ్లాండ్లో ఈ ఏడాది జూన్లో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను చిత్తు చేసింది కేన్ విలియమ్సన్ టీమ్. దానికి ప్రతీకారాన్ని భారత్ తీర్చుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.